రాజధానికి బస్సుల కోత: తెలంగాణ ఒత్తిడికి తగ్గిన ఏపీఎస్ఆర్టీసీ
హైదరాబాద్/అమరావతి: మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ వివాదం నెలకొనేలావుంది. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్కు నిత్యం ప్రయాణించే బస్సులను ఏపీఎస్ఆర్టీసీ భారీగా తగ్గించేస్తోంది. ఇందుకు తెలంగాణ ఆర్టీసీ ఒత్తిడే కారణంగా తెలుస్తోంది.
వచ్చే నెల నుంచే..
ఏపీ నుంచి వచ్చే 221 సర్వీసులను జులై 1 నుంచి రద్దు చేయబోతోంది ఏపీఎస్ఆర్టీసీ. ఎక్కువ ఆదాయం వచ్చే మార్గమైన విజయవాడ-హైదరాబాద్ మధ్యలోనే ఈ బస్సుల కోత ఉండటం గమనార్హం. కాగా, మే10న విజయవాడలో సమావేశమైన తెలుగు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు, మహేందర్ రెడ్డిలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
టీఎస్ఆర్టీసీ ఒత్తిడి
హైదరాబాద్, విజయవాడ మధ్య తిరిగే ఆర్టీసీ బస్సుల్లో టీఎస్ఆర్టీసీ బస్సులు బాగా తక్కువగా ఉన్నాయని తెలంగాణ మంత్రి ఈ సమావేశంలో చెప్పారు. ఈ విషయంలో ఈడీలు చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని మంత్రులిద్దరూ సూచించారు. ఇటీవల హైదరాబాద్కు వెళ్లి బస్సు సర్వీసుల విషయమై తెలంగాణ ఆర్టీసీ ఈడీలతో ఏపీ ఈడీలు చర్చించారు.
బస్సుల కోత
రెండు రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులకు సంబంధించి అంతర్రాష్ట సర్వీసుల ఒప్పందాన్ని అమలు చేద్దామని టీఎస్ఆర్టీసి ప్రతిపాదించింది. దీంతో 221 షెడ్యూళ్లను తాము విరమించుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు భరోసా ఇచ్చారు. కాగా, ఈ విషయం తెలియడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కార్మికల సంఘాల హెచ్చరిక
కాగా, ఏపీఎస్ఆర్టీసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ మండిపడుతున్నాయి. ఉమ్మడి ఆస్తుల పంపకం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోని అధికారులు.. షెడ్యూళ్ల రద్దు ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక, ఏపీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హెచ్చరించింది.