ఏపీలో బస్సెక్కాలంటే కొత్త రూల్స్ ఇవే- పాటిస్తేనే ప్రయాణం- తేడా వస్తే మధ్యలోనే దించేస్తారు..
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన బస్సు సర్వీసులను రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు చర్యలు తీసుకుంటోంది. బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. వీటిని తప్పనిసరిగా పాటిస్తేనే ప్రయాణాలకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Recommended Video
ధూల్ పేటలో నిశ్చితార్ధం ధూమ్ ధామ్.. 15 మందికి కరోనా పాజిటివ్
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే..
ఇకపై ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే కరోనా లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ ఉండకూడదు. ఇవి లేవని నిర్ధారించుకున్నాకే ప్రయాణికులను బస్సుల్లోకి అనుమతిస్తారు. బస్సు ఎక్కాక కూడా డ్రైవర్ కు కానీ, తోటి ప్రయాణికులకు కానీ అనుమానమొస్తే ఇబ్బందులు తప్పవు. కరోనా వైరస్ లేదని నిర్ధారించుకున్నాకే బస్సులు ఎక్కాలని అధికారులు సూచిస్తున్నారు. అలా కాదని కరోనా లక్షణాలను దాచిపెట్టి బస్సు ఎక్కడం ద్వారా వైరస్ వ్యాప్తికి కారణమైతే అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద కేసులు తప్పవు.
వృద్ధులకు, గర్భిణీలకు నో....
కరోనా లక్షణాలు ఉన్నా, లేకపోయినా 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, గర్భిణీలకు బస్సు ప్రయాణికులకు అనుమతించకూడదని ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వీరికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వృద్ధులు తమ వయసు నిర్దారణ కోసం అవసరమైన ఆథార్ లేదా ఇతర ధృవీకరణ పత్రాన్ని ప్రయాణంలో తమతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే రైల్వేతో పాటు ఆర్టీసీలోనూ రాయితీల కోసం వీటిని వినియోగిస్తున్నారు.
మాస్కుల్లేకపోతే అంతే సంగతులు..
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సిందేనని మరో నిబంధన విధించారు. బస్సు ఎక్కేటప్పుడే మాస్క్ ఉందా లేదా అనేది చూస్తారు. బస్సు ఎక్కిన తర్వాత కూడా మాస్కు ధరించకపోతే ప్రయాణం మధ్యలో బస్సు దింపేసేందుకు డ్రైవర్కు వీలు కల్పించారు. అంటే బస్సు ఎక్కిన తర్వాత నుంచి దిగేవరకూ మాస్కు తప్పనిసరి అన్నమాట.