ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగం- ఒకే యాప్లో బుకింగ్, ట్రాకింగ్, పార్శిల్స్-70 కోట్ల ప్రాజెక్టు
ఏపీలో ఆర్టీసీ సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ వివిధ యాప్లు, వెబ్సైట్లకే పరిమితమైన విభిన్న సేవల్ని ఏకీకృతం చేస్తూ ఓ కొత్త యాప్కు రూపకల్పన చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ఏపీలో ఆర్టీసీ బస్సుల ట్రాకింగ్, టికెట్ల బుకింగ్స్, పార్శిల్ బుకింగ్స్ కూడా ఒకే యాప్లో లభిస్తాయి. దీంతో ప్రయాణికులకు, కస్టమర్లకు మంచి వెసులుబాటు లభిస్తుంది. రూ.70 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు ఆహ్వానించబోతున్నారు.
ఆర్టీసీ సేవలన్నింటికీ ఒకే యాప్
ఏపీలో ఆర్టీసీ యాప్ అంటే అందరికీ గుర్తుకొచ్చేలా అన్ని సేవల్ని ఒకే చోట చేర్చుతూ ఓ ఏకీకృత మొబైల్ యాప్ రూపకల్పనకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో టికెట్ల బుకింగ్ కోసం ఓ యాప్, పార్శిల్ బుకింగ్స్ కోసం మరో యాప్, బస్సు లైవ్ ట్రాకింగ్ కోసం మరో యాప్ అవసరం లేదని భావిస్తున్న ఆర్టీసీ.. త్వరలోనే వీటితో పాటు మరిన్ని సేవల్ని అందుబాటులోకి తెస్తూ ఈ కొత్త యాప్కు రూపకల్పన చేస్తోంది. గతంలో ప్రథమ్ పేరుతో ఓ యాప్ తీసుకొచ్చినా అది విఫలం కావడంతో ఈసారి మరిన్ని జాగ్రత్తలతో ఈ కొత్త యూప్ తయారు చేయిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అన్ని టికెట్లు, పార్శిల్ బుకింగ్స్, ట్రాకింగ్
ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మాత్రమే రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ సౌకర్యం కల్పిస్తుండగా.. ఈ కొత్త యాప్ ద్వారా ప్రతీ బస్సు టికెట్లను ఇందులోనే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. పల్లెవెలుగు, సిటీ బస్సుల టికెట్లు సైతం ఇందులోనే బుక్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ అవకాశం ఉన్న బస్సులకు మాత్రమే లైవ్ ట్రాకింగ్ ఇస్తుండగా.. తాజా యాప్తో అన్ని బస్సుల లైవ్ ట్రాకింగ్ అందుబాటులోకి వస్తుంది. దీంతో బస్సు వచ్చే సమయానికే బస్టాండ్కు వెళ్లొచ్చు. కమాండ్ కంట్రోల్ ద్వారా డ్రైవర్లు, కండకర్ల వద్ద ఉండే ఆండ్రాయిడ్ డివైజ్ల్లో టికెట్ల బుకింగ్ వివరాలు పూర్తిగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రూ.70 కోట్ల ఖర్చుతో భారీ ప్రాజెక్టు...
ఆర్టీసీ తయారు చేయించే ఈ ఏకీకృత యాప్ కోసం ప్రత్యేక సర్వర్లు, ఈపోస్ యంత్రాలు, సెంట్రల్ కమాండ్ సెంటర్, ట్రాకింగ్ పరికరాలు అన్నింటినీ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకోసం రూ.70 కోట్ల ఖర్చవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మేరకు యాప్ తయారీ సంస్ధలకు టెండర్లు వేయాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఇప్పటికే నాలుగు సంస్ధలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశంలో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రోత్సహించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో 10 నుంచి 20 కోట్ల రూపాయలు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో రాష్ట ప్రభుత్వం మిగతా 50 కోట్లు భరిస్తే సరిపోతుంది.