మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగా
అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చేశారు. దీని తరువాత ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఈ రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభం కావడం ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి. ఈ నెల 25వ తేదీన చెన్పైకి బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. అన్లాక్లో భాగంగా అంతర్రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా, ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీనితో ఒక్కో రాష్ట్రానికి.. అక్కడి కోవిడ్ పరిస్థితులు, ప్రజల రవాణా అవసరాల మేరకు బస్ సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. తొలిదశలో చెన్నైకి మాత్రమే బస్సులను నడిపిస్తారు. క్రమంగా దీన్ని ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తారు. ఈ నెల 25వ తేదీ నుంచి తెల్లవారు జాము నుంచి చెన్నైకి బస్సులను నడిపిస్తామని అధికారులు వెల్లడించారు. వేర్వేరు ప్రాంతాలు, జిల్లా కేంద్రాల నుంచి.. బస్సులు చెన్నైకి బయలుదేరి వెళ్తాయని పేర్కొన్నారు.
ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఎన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుందనేది రీజనల్, డివిజనల్ మేనేజర్లు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కరోనా వ్యాప్తి చెందడానికి మునుపటిలా ఇబ్బడిముబ్బడిగా బస్సులు అందుబాటులోకి తీసుకుని రాకపోవచ్చని తెలుస్తోంది. ఇదివరకు ఏపీ నుంచి తమిళనాడులోని వేర్వేరు నగరాలు, ప్రాంతాలకు 273 బస్సులు నడిచేవి. ఈ సారి ఇందులో సగం వరకు సర్వీసుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది.
ప్రయాణికుల డిమాండ్, వారి అవసరాలకు అనుగుణంగా సర్వీసులను నడిపిస్తారు. క్రమంగా వాటి సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. తమిళనాడు సరిహద్దు జిల్లాల నుంచి చెన్నైకి పెద్ద సంఖ్యలో బస్సులను నడిపిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి- చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని దాదాపు అన్ని డిపోల నుంచీ చెన్నైకి పూర్తిస్థాయిలో బస్సులను నడిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.