ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం... మరిన్ని కొత్త సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో పలు నగరాలు, పట్టణాలకు బస్సు సర్వీసులు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల నుంచి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభించాలని నిర్ణయించింది.
విజయవాడ నుంచి ఇప్పటికే విశాఖపట్నానికి 'ఇంద్ర' ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించగా, ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో మరిన్ని ఏసీ సర్వీసులు నడపాలని భావిస్తోంది. ఏసీ బస్సులను విశాఖతోపాటు కడప, కర్నూలు, తిరుపతిలకు నడపాలని నిర్ణయించింది.
అలాగే ప్రస్తుతం నడుపుతున్న బస్సు సర్వీసులను కూడా పెంచుతోంది. ఇక ఏసీ బస్సుల్లో దుప్పట్లను ప్రయాణికులే తెచ్చుకోవాలనే నిబంధనను ఆర్టీసీ అమల్లోకి తెస్తోంది. ఏసీ బస్సుల్లో అటెండర్ కూడా ఉండడు. బస్సుల్లో ఏసీని కూడా ఓ లిమిట్లో మాత్రమే ఉంచనున్నారు.
ఇక వంద శాతం నగదు రహిత లావాదేవీలు... ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానం(ఓపీఆర్ఎస్)లో టిక్కెట్లను జారీ చేస్తారు. బస్టాండ్లలో కరెంట్ బుకింగ్ అవకాశం కల్పించనున్నారు. డిమాండ్ను బట్టి ఆయా రూట్లలో అప్పటికప్పుడు బస్సులను నడపనున్నారు.