ఇక బస్టాండ్లలో పెట్రోల్ బంక్ లు- పలు లాభాలు- పెట్రో సంస్ధలతో ఏపీఎస్ఆర్టీసీ చర్చలు...
కరోనా వైరస్ రాక తర్వాత ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా సంస్ధలన్నీ తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. అన్నింటిదీ ఒకటే మాట, ఒకటే బాట. ఖర్చు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. దీర్ఘకాలంలో పరిస్దితులను తట్టుకుని నిలబడాలి. ఇప్పుడిదే వ్యూహంతో ముందుకెళుతోంది ఏపీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే బస్టాండ్లలో పెట్రోల్ బంక్ ల ఆలోచన.
Recommended Video
బస్టాండ్లలో పెట్రోల్ బంక్ లు...
ఏపీలో ప్రధానమైన 90 బస్ స్టేషన్లలో పెట్లోల్ బంక్ లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ప్రభుత్వానికి తాజాగా వచ్చింది. కరోనా నేపథ్యంలో తమకు ప్రధాన స్ధిరాస్తులుగా ఉన్న బస్టాండ్లపై ఏ ఒక్క రూపాయి అదనంగా వచ్చినా చాలని భావిస్తున్న ఆర్టీసీ... బస్టాండ్ ప్రాంగణాల్లో పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముందుగా ఎంపిక చేసిన బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేశాక ఫలితాల ఆధారంగా మిగతా వాటికి కూడా విస్తరించాలనేది ఆర్టీసీ ఆలోచన.
పెట్రో సంస్ధలతో చర్చలు...
పెట్రోలియం సంస్ధల కేంద్ర ప్రభుత్వం, ఎంపీల సిఫార్సుల ఆధారంగా ఇప్పుడు పెట్రోల్ బంకులను కేటాయిస్తున్నాయి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అడిగినా సదరు ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇదే కోవలో ఆర్టీసీ బస్టాండ్లలో పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను అధికారులు పెట్లోలియం సంస్ధలతో చర్చిస్తున్నారు. అతి త్వరలో దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశముంది.
అదనపు ప్రయోజనాలు....
ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ఇంధనం నింపుకునేందుకు డిపోల్లో ఉన్న బంకులనో, లేదా బయట మార్కెట్లో ఉన్న బంకులనో ఆశ్రయించక తప్పని పరిస్దితి. వీటిలో నాణ్యత కచ్చితంగా ఉంటుందా అంటే అనుమానమే. ఇదే బస్టాండ్లోనే పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికక్కడే ఇంధనం నింపుకుని ప్రయాణం ప్రారంభించవచ్చు. సొంత బంకు కాబట్టి ప్రత్యేకంగా ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన పని లేదు. సమయం, డబ్బు ఆదా అవుతుంది.
ఆర్టీసీకే కాదు అందరికీ ?
ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్టాండ్లకు సమీపంలో పెట్లోల్ బంకులు లేవు. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం బస్టాండ్లలోనే బంకుల ఏర్పాటుతో ఆర్టీసీలో కాంట్రాక్టు పద్ధతిని నడుపుతున్న బస్సులకూ ఇక్కడే ఇంధనం నింపుకునే అవకాశం లభిస్తుంది. దీని వవల్ల అదనంగా ఆదాయం కూడా సమకూరుతుంది. అలాగే ఇతర ప్రైవేటు వాహనాలకూ ఇంధనం నింపుకునే అవకాశం ఇస్తే వారు కూడా నాణ్యత ఆధారంగా వీటివైపు మొగ్గు చూపే అవకాశముంది. అయితే ఇప్పుడే ప్రైవేటుకు అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.