coronavirus: ఏప్రిల్ 14 వరకు స్థిరంగా ఆక్వా ధరలు: మంత్రి కొడాలి నాని
ఆక్వా ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ధరలు స్టేబుల్గా ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆదివారం గుడివాడలో ఆక్వా రైతులు మంత్రిని కలిసి రొయ్యల పెట్టుబడి, ఎగుమతి సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు హామీనిచ్చారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు.
రొయ్యలు ఎగుమతి చేసే గ్లోవెల్ కంపెనీ అధినేత చింతపల్లి సుధీర్తో ఫోన్లో మాట్లాడారు. రొయ్యల ఎగుమతికి అవసరమైన వాహనాలను పంపించాలని కోరారు. వాస్తవానికి మార్కెట్లో ఆక్వా ఉత్పత్తుల ధరల్లో ఎక్కువ, తక్కువ ఉందని.. కానీ దేశంలో ఫస్ట్ టైం రాష్ట్రంలో ధరలు స్థిరంగా ఉండాలని నిర్ణయించినట్టు మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు ఆగకుండా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
Recommended Video
కరోనా వైరస్ నేపథ్యంలో దళారుల మాట విని రైతులు మోసపోవద్దని మంత్రి కొడాలి నాని కోరారు. గుర్తింపు కార్డులు చూపితే భవన నిర్మాణ కార్మికులను పనిచేసే చోటుకు పంపిస్తామని మంత్రి తెలిపారు. కార్మికుల సమస్యలను భవన నిర్మాణ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి జేమ్స్.. అంతకుముందు మంత్రి కొడాలి నాని నివాసంలో కలిసి సమస్యలను వివరించారు. కరోనా వైరస్ వల్ల కొందరిని అనుమతించడం లేదని పేర్కొన్నారు. కానీ మరికొందరినీ మాత్రం పనులకు పంపిస్తున్నామని, ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే కార్మికులను ఇబ్బందికి గురిచేయొద్దు అని పోలీసులకు స్పష్టంచేశారు.