విషాదంగా విహారయాత్ర: మరణాలను తగ్గించిన వృక్షం, మృతులు వీరే, పీఎం మోడీ, సీఎంల దిగ్భ్రాంతి
విశాఖపట్నం: ఎంతో ఆనందంగా, సరదాగా గడుపుతామని వెళ్లిన విహార యాత్ర విషాద యాత్రగా ముగిసింది. విశాఖపట్నం జిల్లా అరకు లోయలో జరిగిన ప్రమాదం పలువురి కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. అనంతగిరి మండలం డముకులో ఐదో నెంబర్ మలుపు వద్ద పర్యాటక బస్సు.. 80 అడుగుల లోయలో పడిన విషయం తెలిసిందే.
అరుకు ఘటనలో మృతులు వీరే
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 19 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను బయటికి తీసినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల వివరాలు: సరిత(30), సత్యనారాయణ (50), లత(30), నిత్య అనే 8 నెలల చిన్నారి.
19 మందికి తీవ్రగాయాలు
ప్రమాద సమయంలో 23 మంది పర్యాటకులు ఉండగా, వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలపాలైన ఐదుగురు చిన్నారులతోపాటు 12 మందిని ఎస్ కోట ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మరికొంత మంది క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా ప్రమాదం.. టోల్ ఫ్రీ నెంబర్లు..
ప్రమాదానికి గురైన బస్సు(నెం. )ను హైదరాబాద్ షేక్పేటకు చెందిన దినేశ్ ట్రావెల్స్కు చెందినది గుర్తించారు. మృతులంతా కూడా హైదరాబాద్కు చెందినవారే. హైదరాబాద్ నుంచి అరుకు అందాలను చూసేందుకు, ఇతర ప్రాంతాలను దర్శించేందుకు పర్యాటకులు ఈ బస్సులో వచ్చారు. అరకు నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద వివరాల కోసం అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివరాల కోసం 08912590102, 08912590100 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
పెను ప్రమాదాన్ని తప్పించిన భారీ వృక్షం
కాగా, అరకు బస్సు ప్రమాద ఘటనలో ఓ భారీ వృక్షం మరణాల సంఖ్యను భారీగా తగ్గించింది. అదుపుతప్పి లోయలోపడిపోయిన బస్సు.. ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే, ఆ బస్సు మరింతగా లోయలోకి వెళ్లిపోతే ఒడిదుడులకు మరింత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉండేది. ఆ చెట్టు కారణంగా 19 మంది ప్రాణాలతో బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అరకు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
విశాఖ అరకు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'విశాఖ అరకు లోయలో ప్రమాదం జరిగిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
విశాఖ ప్రమాదంపై జగన్, కేసీఆర్ దిగ్భ్రాంతి.. మెరుగైన వైద్యానికి ఆదేశాలు
విశాఖ ప్రమాద ఘటపై ఏపీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విశాఖ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ ప్రమాదం తెలిసి తాను ఎంతో వేదనకు గురైనట్లు తెలంగాణ గవర్నర్ తమిళిసై, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని తమిళిసై ప్రార్థించారు. వారికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సర్కారును కోరారు. విశాఖ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.