అన్నా వదిలేయండి, కాల్పులు జరపొద్దు: హత్యకు ముందు మావోయిస్టులతో కిడారి
విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం మావోయిస్టులు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను కాల్చి చంపిన విషయం తెలిసిందే. తనను చంపడానికి ముందు కిడారి.. నక్సల్స్ను వేడుకున్నారని తెలుస్తోంది. అన్నా... వదిలేయండి, రాజకీయాలన్నీ మానేస్తానని చెప్పారట. అంతకుముందు రెండు రోజుల ముందే తమకు సమాచారం ఇవ్వకుండా గ్రామాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
చుట్టుముట్టి, వెపన్స్ తీసుకొని: ఎమ్మెల్యే కిడారి హత్యకు ముందు గంటసేపు మాట్లాడిన మావోలు
ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని మావోయిస్టులు చుట్టుముట్డడం, వాహనం నుంచి కిందకు దిగాక ఆయనను కొంతదూరం కాలి నడకన తీసుకు వెళ్లడం, అరమ రోడ్డులో చెట్టుకింద మావోయిస్టులు చేసిన హెచ్చరికలు తదితర అంశాలపై ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. మాట్లాడుకుందామని, కాల్పులు జరపవద్దని కిడారి వేడుకున్నారని తెలుస్తోంది.
వేడుకున్న కిడారి, అవకాశాలిచ్చాం.. ఇక చాలు
తాను మైనింగ్ను, రాజకీయాలను వదిలేస్తానని, తనను వదిలి పెట్టాలని కిడారి సర్వేశ్వర రావు మావోయిస్టులను కోరుకున్నారు. రూ. కోట్లు తీసుకొని పార్టీ మారావని, ఆ డబ్బులు చాలలేదా అని మావోయిస్టులు నిలదీశారు. బాక్సైట్ కోసమే రోడ్లను నిర్మిస్తున్నారని, బాక్సైట్ను వెలికితీస్తే గిరిజనల జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరించారని తెలుస్తోంది. గూడ క్వారీ విషయాన్ని కూడా ప్రస్తావించి, దీనిపై చాలా అవకాశాలు ఇచ్చామని, ఇక చాలునని చెప్పి కాల్పులు జరిపారని తెలుస్తోంది. కిడారి అంతకుముందు నుంచే మావోయిస్టుల టార్గెట్గా ఉన్నారు.
హత్యకు రెండ్రోజుల ముందు హెచ్చరికలు
హత్యకు రెండు రోజుల ముందు ఓ పోలీసు అధికారి.. కిడారితో సమావేశమై మావోల దాడులపై హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. మావోల నుంచి ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారమని, పోలీసులకు చెప్పకుండా గ్రామాల్లో పర్యటించవద్దని చెప్పారు. గ్రామదర్శినిలో పాల్గొంటున్న కిడారి మాత్రం వారి హెచ్చరికలను బేఖాతరు చేశారని చెబుతున్నారు. పోలీసు అధికారులతో భేటీ అయినా రెండ్రోజుల్లోనే ఈ సంఘటన జరిగింది.
హిట్ లిస్టులో.. నిఘా
మావోయిస్టుల హిట్ లిస్టులో కిడారి సర్వేశ్వర రావు ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి ఆయన కదలికలను పోలీసులు, నిఘా వర్గాలు గమనిస్తున్నాయి. కాగా, కిడారి ప్రయాణిస్తున్న వాహనాన్ని రోడ్డుపై డజను మంది వరకు మావోయిస్టులు చుట్టుముట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. హతమార్చాక మావోయిస్టులు పరుగెత్తుతున్న దృశ్యాన్ని కూడా సెల్ ఫోన్లో ఒకరు చిత్రీకరించారు.
ఎలాంటి హెచ్చరికల్లేవు
తమకు పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోయామని, ఇకపై సీఎం చంద్రబాబే తమకు పెద్ద దిక్కు అని కిడారి సర్వేశ్వర రావు తనయులు శ్రావణ్ కుమార్, సందీప్లు ఓ మీడియా ఛానల్తో చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తామని చెప్పారు. గ్రామదర్శినికి బయలుదేరిన తమ తండ్రి శివేరు సోమును మొదటి నుంచి కొన్ని శక్తులు అనుసరించి, ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని శివేరి సోము పిల్లలు వాపోయారు. మావోయిస్టులు తమ తండ్రిని హెచ్చరించిన దాఖలాలు లేవన్నారు.