మార్కెట్లో అరకు ఇన్స్టంట్ కాఫీ ప్యాకెట్లు...ఆస్వాదించండి...ఆదుకోండి...
అమరావతి: వీలైనప్పుడల్లా అరకు కాఫీని ఆస్వాదిస్తూ...గిరిజనులను ఆదుకోవాలని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు పిలుపిచ్చారు. గిరిజనుల ఉత్పత్తులతోపాటు కాఫీ గింజలను సేకరించి, ప్రాసెసింగ్ చేయించి, మార్కెటింగ్ చేసి వచ్చిన లాభాలను వారికి అందించడమే గిరిజన సహకార సంస్థ(జీసీసీ) విధి అని మంత్రి ఆనందబాబు వెల్లడించారు.
సోమవారం ఎపి సచివాలయంలో ఎక్సైజ్ మంత్రి జవహర్తో కలిసి మంత్రి నక్కా ఆనందబాబు అరకు వ్యాలీ ఇన్స్టంట్ కాఫీ 2 గ్రాములు, 10 గ్రాముల ప్యాకెట్లను మార్కెట్కు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహంతో 2014లో రూ.90కోట్ల టర్నోవర్ ఉన్న జీసీసీ వ్యాపారం ఇప్పుడు రూ.247 కోట్లకు చేరుకుందన్నారు.
వచ్చే రెండేళ్లలో లక్ష్యం రూ.500 కోట్లు.
మూడేళ్ల నుంచి అరకు కాఫీకి ప్రాచుర్యం లభిస్తోందని, ఈ రోజు అరకువ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ 2 గ్రాముల ప్యాకెట్లు 4 లక్షలు, 10 గ్రాముల ప్యాకెట్లు లక్ష విడుదల చేస్తున్నట్లు తెలిపారు.జీసీసీ టర్నోవర్ ప్రస్తుతం రూ.247 కోట్లకు చేరుకోగా...ఈ ఏడాది రూ.317 కోట్లు, వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. త్వరలో సచివాలయంలో కూడా జిసిసి ఆధ్వర్యంలో ఒక షాపును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం...ప్రోత్సాహం...సహకారం...
రెండు లక్షల ఎకరాల్లో కాఫీ సాగును ప్రోత్సహిస్తూ గిరిజనుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గిరిజన ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంచడానికి రిటైల్ షాపులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సచివాలయంలో కూడా ఒక షాపును ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఆనందబాబు వెల్లడించారు.
అరకు కాఫీ అదుర్స్...రోజూ తాగుతా:మంత్రి జవహర్
ఈ సందర్భంగా ఆనందబాబు, మంత్రి జవహర్ అరకు కాఫీ తాగారు. అరకు కాఫీ రుచి చాలా బాగుందని, ఇకపై ఈ కాఫీనే రోజూ తాగుతానని మంత్రి జవహర్ పేర్కొన్నారు. అరకు కాఫీని...ప్రపంచానికి పరిచయం చేసింది సిఎం చంద్రబాబే నని మంత్రి జవహర్ అన్నారు. పోడు, గంజాయి సాగు చేసుకునే గిరిజనులను ఆదుకోవడానికి కాఫీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రతి గిరిజన కుటుంబం నెలకు రూ.10 వేలు సంపాదించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు
అరకు ఇన్ స్టంట్ కాఫీ కోసం...అడ్వాన్స్ 30 లక్షలు
అనంతరం, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, జీసీసీ ఎండి రవిప్రకాష్ మాట్లాడారు. అరకు కాఫీ రుచి అద్భుతమని అందుకే అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తోందన్నారు. కాగా, కాఫీ డీలర్లు అరకువ్యాలీ ఇన్ స్టంట్ కాఫీ ప్యాకెట్ల కోసం అడ్వాన్స్ గా రూ.30 లక్షల రూపాయల చెక్ ని మంత్రి ఆనందబాబుకు అందజేశారు.