ఆందోళన బాటలో అర్చకులు...కనీస వేతనాల కోసం...రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సన్నద్ధం
విజయవాడ:భక్తులు సుభిక్షంగా ఉండాలని నిత్యం పూజలు చేసే అర్చకులు ఆందోళన బాట పట్టనున్నారు...మంత్రాలు జపించే ఆ గొంతుకలు తమ ఆకలి కేకలు వినిపించేందుకు సన్నద్దమవుతున్నాయి.
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్నఅర్చకులు కనీస వేతనాల్లేక అర్ధాకలితో అలమటిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఉద్యమ బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. చాలీచాలని ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టసాధ్యంగా మారిందని, తెలంగాణా తరహాలో తమకూ పిఆర్సిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆదాయం పుష్టి...వేతనాలు నష్టి...
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ఆలయాలు ఉన్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. వీటిలో విజయవాడ కనకదుర్గ, శ్రీకాళహస్తీశ్వర, కాణిపాక వరసిద్ధి వినాయక, శ్రీశైలం మల్లికార్జున, ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వర, సింహాచల నరసింహ, అన్నవరం సత్యనారాయణ, మహానంది వంటివి ప్రధాన ఆలయాలు కాగా...ఇవి కాకుండా ఏడాదికి రూ. 25 లక్షల నుంచి కోటి పైబడి ఆదాయం వచ్చే ఆలయాలు మరో 115 ఉన్నాయి. అలాగే రూ. 2 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఆదాయం వచ్చేవి 794 ఉండగా, రూ.2 లక్షలకు లోపు వచ్చేవి 22,788 ఆలయాలు ఉన్నట్లు అంచనా. ఇవన్నీ అధికారిక లెక్కలు...ఇవి కాకుండా దేవాదాయ శాఖ పరిధిలోనే ధూప దీప నైవేధ్య పథకం కింద మరో 1,406 ఆలయాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ ఆలయాల్నింటిలో కలిపి సుమారుగా లక్షా10 వేల మంది అర్చకులు విధులు నిర్వహిస్తున్నట్లు ఎపి అర్చక సమాఖ్య తెలియజేస్తోంది.
అతి కొదిమందికే కనీస వేతనం...మిగిలిన వాళ్లందరికి కనిష్ట వేతనమే...
రాష్ట్రంలో కోటి రూపాయల పైబడి ఆదాయం వస్తున్న 8 ప్రధాన ఆలయాల్లోని అర్చకులకు మాత్రమే నెలకు రూ.18 వేల నుంచి రూ.35 వేల వరకు వేతనం వస్తోంది. 25 లక్షలకు పైబడి ఆదాయం వస్తున్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 7 వేల నుంచి 15 వేల వరకు జీతం ఇస్తున్నారు. మిగిలిన 22 వేల ఆలయాల్లో అర్చకులకు సుదీర్ఘకాలంగా అతితక్కువ వేతనం కేవలం రూ.3 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే వస్తోంది. మరోవైపు ధూపదీప నైవేథ్య పథకం వర్తిస్తున్నఆలయాల్లో అర్చకులకు వేతనంతో పాటు పూజా సామగ్రి, నైవేథ్యం వీటన్నింటికీ కలిపి నెలకు కేవలం రూ. 5 వేలు అందుతోంది. ఈ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ఆ పూజాసామాగ్రి ఖర్చులకు పోగానెలకు రూ. వెయ్యి కూడా వేతనంగా మిగలదంటే పరిస్థితి ఎంత దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా...అమలుకు నోచుకోవడం లేదు...
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా అవి అమలుకు నోచుకోకపోవడంపై అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే తమ ఆకలి బాధలు తీర్చుకునేందుకు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సన్నాహకంగా అర్చక సమాఖ్య జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లరిబ్బన్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈనెల16న విజయవాడలో అర్చక ఆత్మావలోకనం సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు సన్నద్దమవుతున్నారు.
అర్చకుల ఆవేదన...మరియు...డిమాండ్లు...
తెలంగాణా ప్రభుత్వం అమలు చేస్తున్న తరహాలోనే ఎపిలోని అర్చకులందరికీ 2015 పిఆర్సిని అమలు చేయాలి...అర్చకులందరికీ సమాన వేతనాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా పాలకులు పటట్టించుకోకపోవడం దురదృష్టకరం. నిత్యం భగవంతుని సేవలో తరించే తమలో వేలాది మంది మూడుపూటలా తిండి తినే పరిస్థితికి కూడా నోచుకోక పస్తులు ఉంటున్న విషయం వాస్తవం. ధూపదీప నైవేథ్య పథకం ద్వారా ఒక్కో ఆలయానికి 5 వేలుతో ఆ కార్యక్రమాల నిర్వహణ, అర్చక కుటుంబ పోషణ అసాధ్యం...పూజా కైంకర్యం, ప్రసాదాలకే రూ.4 వేల నుంచి రూ. 4,500 వరకూ ఖర్చవుతోంది. మిగిలిన వెయ్యి,రూ. 500తో అర్చకులు ఎలా బతకగలరు...ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తెలంగాణా తరహాలో అర్చకులందరికీ పే స్కేల్ ఇవ్వాలని అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దింటి రాంబాబు డిమాండ్ చేశారు.
అర్చక సంక్షేమ నిధి...ఏర్పాటు చేయాలి
అర్చకులు వారి కుటుంబాల సంక్షేమ కోసం అర్చక సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి. దానికోసం బడ్జెట్లో కనీసం రూ.200 కోట్లు కేటాయించాలి. అన్ని ఆలయాల అర్చకులకు ఒకే పే స్కేల్ ఇస్తూ వారి సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేయాలి. కాంట్రాక్టు అర్చకులందరినీ పర్మినెంట్ చేయాలి. అర్చక స్వాములందరికీ హెల్త్ కార్డులను మంజూరు చేయాలి. ధూప,దీప నైవేథ్య పథకానికి ఒక్కో ఆలయానికి రూ.6 వేలివ్వాలి. ఈ డిమాండ్లన్నీ కొత్తవేమీకాదని, 2014 ఎన్నికలకు ముందు బిజెపి, టిడిపి నాయకులు తమ అర్చక సమాఖ్యకు ఆల్రెడీ ఇచ్చిన హామీలేనని...అయితే అధికారంలోకి వచ్చాక తమ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అర్చక సమాఖ్య నేత మేడూరి శ్రీనివాసమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. కీనసం వేతనాల కోసం అర్చకులు చేసే పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ యూనియన్ నేత సుబ్రమణ్యం ప్రకటించారు.