ఆలయాలకు, ఆభరణాలకు భద్రతేదీ?: చర్చకు దారితీసిన టీటీడీకి పురవాస్తు శాఖ లేఖ
ఢిల్లీ/తిరుపతి: తిరుమల తితరుపతి దేవస్థానం(టీటీడీ) పరిధిలో ఉన్న ఆలయాలు, పురాతన కట్టడాల వివరాలివ్వాలంటూ ఢిల్లీలోని కేంద్ర పురావస్తుశాఖ టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్కు లేఖ రాసింది. టీటీడీ అధికారులు ఇష్టంవచ్చినట్లు పురాతన కట్టడాలను తొలగించి కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని, పూర్వకాలంలో రాజులు ఇచ్చిన విలువైన ఆభరణాలు, భక్తులు సమర్పిస్తున్న కానుకలకు సరైన భద్రత కల్పించడంలేదని ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం పరిశీలించి నివేదిక సమర్పించాలని పురావస్తుశాఖను ఆదేశించింది. దీంతో తిరుమలలో ఉన్న పురాతన ఆలయాలు, భవనాల వివరాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా అందజేయాలని కేంద్ర పురావస్తు శాఖ టీటీడీని కోరింది. ఈ మేరకు అమరావతిలో ఉన్న పురావస్తు శాఖ ప్రాంతీయ కార్యాలయం టీటీడీ ఈవోకు లేఖ రాసింది.
కాగా, అమరావతి ప్రాంతీయ కార్యాలయం ద్వారా టీటీడీకి పంపిన లేఖపై అధికారులు పూర్తిగా స్పందించడంలేదు. లేఖ రాసినట్టు తమకు సమాచారం ఉంది గానీ దాన్ని పూర్తిగా పరిశీలించాకే తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. కేంద్ర పురావస్తు శాఖ టీటీడీ పరిధిలోని తిరుమలలో ఉన్న ఆలయాలను పరిశీలించేందుకు ఓ బృందం వస్తోందన్న సమాచారం ఉందని తెలిపారు.
ఈ లేఖను అన్ని కోణాల్లోనూ పూర్తిగా పరిశీలించాకే ప్రత్యుత్తరం రాస్తామని పేర్కొంటున్నారు. టీటీడీ ఆలయాలు, భవనాలు పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్తే.. భక్తులకు అవసరమైన స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
టీటీడీ పరిధిలోని పురాతన ఆలయాలు, భవనాలు పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పురావస్తు శాఖకు ఆలయాలను అప్పగించేది లేదని ఈవో చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో ఈ చర్య చర్చనీయాంశంగా మారింది.
వెనక్కి తగ్గిన పురావస్తు శాఖ
సమాచార లోపంతోనే లేఖ పంపామని పురావస్తు శాఖ స్పష్టం చేసింది. అరగంటలో ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తామురాసిన లేఖను వెనక్కి తీసుకుంటున్నట్టు టీటీడీ ఈవోకు ఆ శాఖ డీజీ ఫోన్ చేసి తెలిపారు. ఈ వివరాలను టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ మీడియాకు వివరించారు. 'పురావస్తు శాఖ పరిధిలోకి తితిదే ఆలయాలు తీసుకొనే అవకాశం లేదని ఆ శాఖ డైరెక్టర్ ఫోన్లో స్పష్టం చేశారు. భక్తుల్లో ఎలాంటి ఆందోళన అవసరంలేదు’ అని తెలిపారు.