సంచలనం:టివి9 ఛైర్మన్ శ్రీనీ రాజు ఆ సంస్థకు గుడ్ చై చెబుతున్నారా?...
పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలతో కలత చెందిన టివి 9 సంస్థ ఛైర్మన్ శ్రీనీ రాజు అందుకు ప్రతిగా పవన్ కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ లీగల్ నోటీసును కూడా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఆ లీగల్ నోటీసును పరిశీలిస్తే సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం టివి 9 సంస్థ ఛైర్మన్ శ్రీనీ రాజు అతి త్వరలో ఆ సంస్థ నుంచి బైటకు వచ్చేస్తున్నట్లు అందులో శ్రీనీ రాజు తరుపు న్యాయవాది పేర్కొనడం గమనార్హం. అంతేకాదు శ్రీనీ రాజు పవన్ కళ్యాణ్ కు పంపిన లీగల్ నోటీసులో కూడా ట్విట్టర్ అకౌంట్ నుంచి తన పేరు తీసేయమని, లేనిపక్షంలో చట్టపరంగా తాను చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడం జరిగింది.
శ్రీనీ రాజుపై...పవన్ ఆరోపణలు
ఏప్రిల్ 20 న పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో టిడిపి, టివి 9, రాంగోపాల్ వర్మ గురించి విమర్శలు చేసిన క్రమంలో టివి 9 ఛైర్మన్ శ్రీనీ రాజు, సిఈవో రవి ప్రకాష్, దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరి ముగ్గురితో కూడిన ఒక ఫోటోను పోస్ట్ చేసి ఈ ముగ్గురి త్రయమే తన తల్లిని బహిరంగంగా అవమానపర్చడంలో టిడిపికి సహకరించిందని వ్యాఖ్యానించారు.అలాగే శ్రీనీ రాజుకు టివి 9 సంస్థలో 88.69 శాతం వాటా ఉందని, అంత ధనికుడు కాబట్టే ఎవరినైనా తేలిగ్గా నిందించగలుగుతున్నారని,ఆయన సత్యం రామలింగరాజుకు దగ్గరి బంధువని, అలాగే రామ్ గోపాల్ వర్మకు కూడా బంధువేనని వివిధ ట్వీట్ ల్లో పవన్ ఈ ఆరోపణలు చేశారు.
శ్రీనీ రాజు..స్పందన...లీగల్ నోటీస్
దీనిపై స్పందించిన టివి 9 ఛైర్మన్ శ్రీనీ రాజు అడ్వకేట్ టి.సునీల్ రెడ్డితో పవన్ కళ్యాణ్ కు ఒక లీగల్ నోటీస్ పంపించారు. అందులో పవన్ కళ్యాణ్ నిరాధారంగా తన క్లయింట్ పై ఆరోపణలు చేశారని, వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదని పేర్కొంటూ మీపై, మీ కుటుంబం పై చేసిన వ్యాఖ్యలకు ఆయన కూడా చింతించారని, అయితే అదే సమయంలో మీరు కూడా రాజకీయాల్లోకి వస్తూ సత్ప్రవర్తన,సుపరిపాలన అందిస్తానని హామీ ఇచ్చిన మీరు అన్యాయంగా తనపై చేసి వ్యాఖ్యలకు కూడా ఆయన చాలా బాధపడ్డారని పేర్కొన్నారు. మీరు కూడా ఇలా నిరాధారంగా ఆరోపణలు చేస్తే మీకు మిగతా రాజకీయనాయకులకు తేడా ఏముందని తన క్లయింట్ భావనగా అడ్వొకేట్ ఆ నోటీసులో పేర్కొన్నాడు.
శ్రీనీ రాజు...టివి 9 నుంచి బైటకు...
ఇదే నోటీసులో మరో సందర్భంలో టివి 9 లో శ్రీనీ రాజు పెట్టుబడుల గురించి వివరిస్తూ తన క్లయింట్ వెంచర్ క్యాపిటలిస్ట్ అని, అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ మనీ పెట్టుబడిగా పెట్టడం జరిగిందని, అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ సంస్థ కంపెనీ టివి 9 సంస్థను నడుపుతుందని, అయితే వెంచర్ క్యాపిటలిస్ట్ గా పెట్టుబడి పెట్టడమే తప్ప తన క్లయింట్ ఏనాడు టివి 9 మేనేజ్ మెంట్ వ్యవహారాలలో కానీ, బోర్డు వ్యవహారాల్లోకానీ ప్రాతినిథ్యం వహించలేదని, అంతేకాదు అసలు గడచిన పదేళ్లుగా టివి 9 ఆఫీసుకు కూడా ఆయన ఎప్పుడూ వెళ్లలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా టివి 9 సంస్థలో తన క్లయింట్ పెట్టుబడి పెట్టిన పిరియడ్ కూడా అయిపోయిందని, అందువల్ల ఆ సంస్థలో నుంచి బైటకు వచ్చే ప్రక్రియలో కూడా ఉన్నట్లుగా అడ్వకేట్ పేర్కొన్నారు.
ఏం కోరారంటే...ట్వీట్లు డిలీట్ చేయమని
రాంగోపాల్ వర్మ తన క్లయింట్ శ్రీనీ రాజుకు బంధువు కాదని స్పష్టం చేసిన అడ్వకేట్ ఈ వ్యవహారంతో తన క్లయింట్ కు ఏవిధమైన సంబంధం లేనందున ముందు మీరు శ్రీనీ రాజు గురించి చేసిన ట్వీట్లన్నీ డిలీట్ చేసి ఒక నిజాయితీ,అంకితభావం కలిగిన ప్రముఖ వ్యక్తికి మంచి ఉదాహరణగా నిలవాలని, లేనిపక్షంలో తాము చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ లీగల్ నోటీస్ కు ఏ విధంగా స్పందించనున్నారనేది ఇంకా వెల్లడించలేదు. అయితే శ్రీనీ రాజు పంపిన లీగల్ నోటీసు అందినట్లు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కాపీని బట్టి అర్థమవుతోంది. అయితే అందులో కోరినట్లుగా పవన్ కళ్యాణ్ ఇంకా ట్వీట్లు డిలీట్ చేయక పోవడం గమనార్హం. దీంతో ఈ వివాదం ఏ మలుపుతిరుగుతుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది.