ఏపీలో కొత్త పెట్టుబడులేవీ ? వైసీపీ మూడు ముక్కలాట, జగన్మాయ, మోసాలు..చంద్రబాబు అసహనం
ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై అసహనం వ్యక్తం చేశారు . రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన చంద్రబాబు సీఎం జగన్ హయాంలోని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు రావట్లేదని పేర్కొన్నారు . ఇవాళ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన రాజధాని విషయంలో సీఎం జగన్ తీరుపై నిప్పులు చెరిగారు.
Recommended Video
వైసీపీ మూడు ముక్కలాట ఆడుతుందని చంద్రబాబు ఫైర్
వైసీపీ ఆడుతున్న మూడు ముక్కలాట రాష్ట్రాన్నే అతలాకుతలం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు . రాజధాని రైతులు, మహిళలకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు ముందుకురావడం సంతోషమన్న ఆయన ప్రవాసాంధ్రులు అమరావతి ఉద్యమానికి రూ.7,76,022 విరాళం ఇచ్చారని పేర్కొన్నారు . రాజధాని రైతులకు సంఘీభావంగా ఎన్నారైలు ర్యాలీలు జరపడం అభినందనీయమన్న చంద్రబాబు రాజధానిగా అమరావతినే కొనసాగాలని డిమాండ్ చేశారు.
వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోయాయని ఆవేదన
ఇక రాష్ట్రం చాలా వెనుకపడి పోతుందని పేర్కొన్న ఆయన ఇప్పటికే వచ్చిన పెట్టుబడులు వెనక్కిపోయాయి. కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకు పోయాయని అసహనం వ్యక్తం చేశారు .కొత్త పెట్టుబడులు రావడం లేదు. ఉపాధి కల్పనకు అడ్డుగోడ కట్టినట్లు అయ్యిందని ఆవేదన చెందారు . అభివృద్ధిని రివర్స్ చేశారు అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక అంతే కాదు సంక్షేమ పథకాల విషయంలో కూడా వైసీపీ సర్కార్ మోసం చేస్తుందన్న చంద్రబాబు ట్వీట్ల వర్షం కురిపించారు.
పించన్లు కట్.. ఏమిటీ జగన్మాయ అని విస్మయం
పింఛను అర్హత వయసు 5ఏళ్లు తగ్గిస్తే, ఉన్న పింఛన్లు ఇంకా పెరగాల్సింది పోయి తగ్గడం వింతగా ఉందన్నారు చంద్రబాబు . ఏమిటీ జగన్మాయ అంటూ విస్మయం వ్యక్తం చేశారు . 8నెలల్లో 7లక్షల పించన్లకు కోత పెట్టడం, పండుటాకులను మోసం చేయడం కాదా? 45ఏళ్లకే బిసి,ఎస్సీ,ఎస్టీ, మైనారిటి మహిళలకు పింఛను ఇస్తామని హామీ ఇచ్చి ఏమార్చడం మోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు.
జగన్ మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదన్న బాబు
కేంద్రం ఇచ్చిన రూ 6వేలకు అదనంగా రూ 12,500 ఇస్తామని చెప్పి, రైతులను మోసం చేశారన్నారు . నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు టోపి పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇంత మోసకారి కాబట్టే 12 చార్జిషీట్లలో ఇప్పటికీ 420 సెక్షన్ కింద విచారణ ఎదుర్కొంటున్నారు. అయినా మోసాలు చేయడం మాత్రం మానుకోవట్లేదు అని జగన్ మీద విమర్శల బాణాలు సంధించారు చంద్రబాబు .