రాజధానిలో మగాళ్ళు లేరా? వాళ్లకు ఉద్యమం చేసే దమ్ము లేదా ? ఆడంగి వెధవల్లా: రోజా షాకింగ్ వ్యాఖ్యలు
నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజధానిలో అమరావతి కోసం పోరాటం చేస్తుంది రైతులు కాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇక కొందరు రాజకీయనేతలు ఆడవాళ్లను ముందుపెట్టి ఉద్యమం చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు . రోజా ఆడంగి వెధవల్లా వెనక దాక్కుంటున్నారా? అని ఘాటుగా విమర్శలు గుప్పించారు.రాజధానిలో మగాళ్ళకు దమ్ము లేదా అని ప్రశ్నించిన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజధాని అమరావతి రైతుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.
హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారన్న రోజా
అమరావతిలో మీడియాతో మాట్లాడిన రోజా రాజధానిలో పోరాటం చేస్తుంది ఇక్కడి వారు కాదన్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి నుంచి ఇక్కడికి బస్సుల్లో వచ్చి ధర్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆడవాళ్లను రోడ్లపైకి పంపించి పోలీసులు కొట్టారంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు. కావాలని మహిళలను ముందుకు పెట్టి మగాళ్ళు వెనక ఉండి డ్రామాలాడుతున్నరన్నారు.
అమరావతిలో మగవాళ్లు లేరా? ప్రశ్నించిన రోజా
అమరావతిలో మగవాళ్లు లేరా? వాళ్లకు ఉద్యమాలు చేసే దమ్ములేదా? అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు రోజా. అంతేకాదు మీరు చేసిన తప్పులకు ఆడవాళ్లను ఎందుకు బలిచేస్తున్నారు? అంటూ రోజా ప్రశ్నించారు.అమరావతి ప్రాంత మహిళలందరూ స్వార్థంతోనే ఉద్యమాలు చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు రోజా. ఇక హైదరాబాద్ నుండి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, టీడీపీ నేత నారా లోకేశ్ కు సన్నిహితుడైన ఒక దర్శకుడు కూడా మనవాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్లి ధర్నాలు బాగా చేస్తున్నారని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారని రోజా ఎద్దేవా చేశారు .
చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గు పడుతున్నా
చంద్రబాబు మహిళలను ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నారన్న రోజా చంద్రబాబు లాంటి వ్యక్తి చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తాము సిగ్గుపడుతున్నామని ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై టీడీపీ నేతలు ఇంత రాద్ధాంతం చేస్తున్నారని,అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం జగన్ కోరుకున్నారని అందుకే మూడు రాజధానుల ఆలోచన చేశారని రోజా తెలిపారు. సీఎం జగన్ కోరుకుంటే రాజధానిని కడపలో ఏర్పాటు చేసుకునేవారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనను ఎవరూ నమ్మరని రోజా పేర్కొన్నారు.