ముందస్తు ఎన్నికలకు సిద్ధమా?...చంద్రబాబుకు వైసిపి ఎమ్మెల్యే ఛాలెంజ్!
అమరావతి:తెలంగాణా మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోనూ ముందస్తూ ఎన్నికలకు సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.
శుక్రవారం హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మరో ఎమ్యెల్యే ఆదిమూలపు సురేష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్దాంతం అంటూ లేకుండా చేసేశారని శ్రీకాంత్ విమర్శించారు. 1996లో సీపీఐ, సీపీఎంలతో 1999, 2004లో బీజేపీతో, 2009లో మహాకూటమి పేరుతో సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్తో కలిసి పోటీ చేశారని, 2014లో మళ్లీ బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. స్వలాభం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని శ్రీకాంత్ దుయ్యబట్టారు.
పబ్లిసిటీ కోసం పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని శ్రీకాంత్ మండిపడ్డారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో టీడీపీ అవినీతికి పాల్పడిందని, తాము అసెంబ్లీలో లేకపోయినా ప్రజల్లో ఉండి వారి కోసం పోరాటం చేస్తున్నామన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని వాళ్లే చెప్పారని, మహిళల గొంతు కోసి ఇప్పుడు అనైతిక పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని విమర్శించారు.
ఎపి అసెంబ్లీ:రెండో రోజు సమావేశాలు ప్రారంభం...ప్రశ్నోత్తరాల్లో చర్చనీయాంశాలు ఇవీ!
2009లో తన పరిపాలనపై నమ్మకంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి గెలుపు సాధించారని శ్రీకాంత్ గుర్తుచేశారు. చంద్రబాబుకు కూడా తన పరిపాలనపై నమ్మకం ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్దమా?...అని శ్రీకాంత్ ప్రశ్నించారు. తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సిద్దమవుతున్నారని ధ్వజమెత్తారు. తమ పార్టీ కాంగ్రెస్, బీజీపీతో పొత్తులు పెట్టుకోదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మీ కోసం వస్తున్నా అంటూ గతంలో పాదయాత్ర చేసిన చంద్రబాబు అప్పుడు అలవెన్సులు తీసుకోలేదా అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. సిఎం ద్వంద వైఖరి అవలంభించడం ఎంత వరకు కరెక్ట్ అని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే దమ్ముందా అనిఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన 22 మంది ఎందుకు అనర్హత వేటు వేయడం లేదని నిలదీశారు.
ఫిరాయింపుదారులకు మంత్రి పదువులు ఇచ్చినందుకు నిరసనగానే తాము సభకు వెళ్లడం లేదన్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసి, మంత్రులను బర్త్రఫ్ చేసిన ఉదయమే అసెంబ్లీకి వస్తామన్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మీ కోసం వస్తున్నా అంటూ గతంలో పాదయాత్ర చేసిన చంద్రబాబు అప్పుడు అలవెన్సులు తీసుకోలేదా అని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు.