రా.. తేల్చుకుందాం.. నా నియోజకర్గంలో నీ జోక్యమేంటి?: చింతమనేనిపై పీతల
నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం.. అయినా నా నియోజకర్గంలో నీ జోక్యమేంటి?' అంటూ పీతల సుజాత చింతమేననిపై విరుచుకుపడ్డారు.
ఏలూరు: టీడీపీలో సొంతగూటి నేతల మధ్యే విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా.. పక్క నియోజకర్గ ఎమ్మెల్యే తన నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల పీతల సుజాత గుర్రుగా ఉన్నారు.
మంగళవారం నాడు జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా.. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు మంత్రి పీతల సుజాతకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జిల్లా ఇంచార్జీ అయ్యన్నపాత్రుడి ఎదుటే ఇద్దరు నేతలు.. ఢీ అంటే ఢీ అన్న తరహాలో వాదులాటకు దిగారు.
వివాదానికి కేంద్రబిందువు:
ఇటీవల ఏలూరులో జరిగిన ఓ థియేటర్ ప్రారంభోత్సవం ఈ వివాదానికి కేంద్రబిందువు. దీని ప్రారంభోత్సవానికి విప్ చింతమనేని ఆహ్వానించిన థియేటర్ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాతను పక్కనబెట్టేసింది. విషయం తెలుసుకున్న పీతల సుజాత ఈ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్నారు.
రా తేల్చుకుందాం..: పీతల సుజాత
సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగానే..'నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం.. అయినా నా నియోజకర్గంలో నీ జోక్యమేంటి?' అంటూ పీతల సుజాత చింతమేననిపై విరుచుకుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆహ్వానించారు.. వెళ్లాను..: చింతమనేని
తనను ఆహ్వానించారు కాబట్టి వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరమేంటని చింతమనేని సుజాతను ప్రశ్నించారు. దీంతో తనకు ఆహ్వానం లేనిచోట మరో టీడీపీ నేత ఎలా వెళ్తారని, ఇది ఎంతవరకు సమంజసమని పీతల సుజాత నిలదీశారు.
ఎవరికో చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు:
ఎవరికో చెప్పి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని ధీటుగా బదులిచ్చారు. చింతమేని వ్యాఖ్యలతో ఆగ్రహావేశానికి లోనైన సుజాత 'రా తేల్చుకుందాం.. ఎస్సీ నియోజకర్గం కదా! అని మీ ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే సహించేది లేదు' అని సీరియస్ గా హెచ్చరించారు.
అయ్యన్నపాత్రుడి జోక్యం:
ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమవుతుండటంతో జిల్లా ఇన్ ఛార్జీ చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆ నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం భావ్యం కాదని చింతమనేనికి హితవు పలికారు.
కనీస గౌరవమివ్వరా!:
పార్టీలో సీనియర్ నేతనైన తాను పార్టీ కోసం చాలా కష్టపడ్డానంటూ చెప్పుకొచ్చారు పీతల సుజాత. కష్ట సమయాల్లోను పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందంటూ ఆవేదన చెందారు. చివరికి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో ఈ వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగినట్టుగానే కనిపిస్తోంది.