రిషితేశ్వరి ఘటనపై అసెంబ్లీలో వాగ్వివాదం: రోజా వర్సెస్ ధూళిపాళ్ల
హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్తిని రిషితేశ్వరి ఘటనపై బుధవారం శాసనసభలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి మృతికి టీడీపీయే కారణమని ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చాకే మహిళలపై దాడులు పెరిగాయని రోజా అన్నారు. ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్కు టీడీపీ కొమ్ముకాస్తుందని ఆరోపించారు. ఆడపిల్లల ప్రాణాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి విలువ లేదా అని రోజా ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.
రోజా చేసిన విమర్శలను తెలుగుదేశం సభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి ఖండించారు. రిషితేశ్వరి ఆత్మహత్యను వైసీపీ రాజకీయం చేస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. వైసీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. వైసీపీ వ్యక్తిపైన పోరాటం చేస్తుందో, వ్యవస్థపై పోరాటం చేస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.

వ్యవస్థపై పోరాడుతూ ఆడపిల్లలను కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉంటే వ్యక్తుల్ని లక్ష్యం చేసుకుంటూ రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ పాకులాడడం సిగ్గుచేటని ఆయన చెప్పారు. యూనివర్సిటీలో వర్గవిభేధాలున్న మాట వాస్తవమని ఆయన అన్నారు. వ్యవస్థలో లోపాలున్న మాట వాస్తవమని, కానీ వాటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన 10సంవత్సరాల పాపమని ఆయన దుమ్మెత్తిపోశారు.
శవ రాజకీయాలు చేయడం వైసీపీ జన్మహక్కు అని ఆయన ఎద్దేవా చేశారు. రిషితేశ్వరి ఆత్మహత్య తనను కలచివేసిందని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ఇకనైనా వ్యక్తులను టార్గెట్ చేయడం మాని, వ్యవస్థపై పోరాడాలని ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు.












Click it and Unblock the Notifications