వరదలు వస్తే కొట్టుకుపోయే ప్రాంతంలో అమరావతి: ఎన్జీటీలో వాదనలు
విజయవాడ/హైదరాబాద్: కృష్ణానదితో పాటు కొండవీటి వాగుకు వరదలు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్లో వాదనలు వినిపించారు పిటిషనర్లు.
ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తున్నారని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్లో ఆరోపిస్తున్న పిటిషనర్లు తమ వాదనలను వినిపించారు.
వరద ప్రభావిత ప్రాంతాలను నిర్మాణ పరిధి నుంచి తలగించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. రాజధాని బృహత్ ప్రణాళిక నుంచి ఈ ప్రాంతాలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
అసలు వరదకు గురయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి వుందని, ఇవేమీ చేయకుండానే అమరావతిని నిర్మిస్తున్నారని తెలిపారు. తాము ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రైబ్యునల్ ముందు వాదించగా, కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
పండ్లు కొనాలంటే భయంగా ఉంది: హైకోర్టు
మార్కెట్లో పండ్లు కొనాలంటే భయంగా ఉందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది.తెలుగు రాష్ట్రాల్లో రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మాగబెట్టడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇథిలీన్తో కాయలను మాగబెట్టే కేంద్రాలను నిర్ణీత కాలంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సూచించింది. దీనిపై స్పందించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు సూచనలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.