పవన్ కళ్యాణ్ రూ. కోటి విరాళం: నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు
హైదరాబాద్: భారత సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అతి త్వరలోనే సైనిక్ బోర్డుకు సంబంధిచిన వ్యక్తులను కలిసి డీడీ అందజేయనున్నట్లు తెలిపారు.
మోడీకి కృతజ్ఞతలు
దేశం పట్ల చూపించాల్సిన బాధ్యతను మనకు గుర్తుచేసిన ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.డిసెంబర్ 7న సాయుధ పతాక దినోత్సవం సందర్భంగా సైనికుల కుటుంబాల సంక్షేమానికి మన మద్దతు తెలియజేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
మండపేటలో పర్యటిస్తా..
‘అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాల్లో వరి సాగు చేసిన రైతుల కష్టాలు నా దృష్టికి వచ్చాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడం, ఏర్పాటు చేసిన చోట సక్రమంగా కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందిపెడుతున్నారు. అలాగే కొనుగోలు చేసిన పంటకు సొమ్ము కూడా చెల్లించడం లేదని రైతులు తెలిపారు. తేమ శాతం, ముక్కలు, కేళీ అని నిబంధనలు చెబుతూ రైతులకు మద్దతు ధర చెల్లించకుండా ధర తగ్గిస్తున్నారు. ఈ సమస్యలను తెలియచేస్తూ రైతాంగం నాకు విజ్ఞాపన పంపింది. వారి కష్టాలను తెలుసుకొనేందుకు డిసెంబర్ 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో పర్యటిస్తాను. అక్కడ రైతులను స్వయంగా కలుసుకొంటాను. అన్నదాతలకు అండగా నిలుస్తాను' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
దిశ ఘటనపై పవన్ కళ్యాణ్..
‘దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోంది. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం,ఆక్రోశం,ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ప్రజలు కోరుకున్న విధంగా..
జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఈ ఆవేదనే. దిశ సంఘటన ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు తీసుకొచ్చింది.అయినా అత్యాచారాలు ఆగలేదు.అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయి.ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది.ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి.మేధావులు ముందుకు కదలాలి.వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమాంకంపాడాలి. ఇలాంటి కేసులలో కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలి. రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలి.ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి యోచన జరగాలి.నేర స్థాయినిబట్టి అది మరణ శిక్షఅయినా, మరే ఇతర శిక్ష అయినా సరే, బహిరంగంగా అమలు జరపాలి. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని,ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.