కేంద్ర బలగాలకు అప్పగించాలి: అవినీతి ఆధారాలను మాయం చేస్తున్నారు: జగన్ ఫైర్..!
ఏపిలోని ఇవియంలు నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలను మొహరించాలని వైసిపి అధినేత జగన్ విజ్ఞప్తి చేసారు. గవర్నర్ నరసింహన్ తో పార్టీ నేతలతో కలిసి జగన్ సమావేశమయ్యారు. తన అనుయాయులకు వేలాది కోట్ల విలువైన బిల్లులను విడుదల చేస్తన్నారని..దీనిని అడ్డుకోవాలని జగన్ కోరారు. ప్రజలు పోలింగ్ లో బైబై బాబు అని చెప్పారని..దీనిని గ్రహించే చంద్రబాబు ఇవియంల పైన రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
టిడిపి నేతల పై కేసుల్లేవ్..వైసిపి నేతల పై మాత్రం..
వైసిపి అధినేత జగన్ గవర్నర్ కు వినతి పత్రం అందచేసారు. ఎన్నికల్లో పోటీ చేసిన తమ పార్టీ అభ్యర్దుల పై దాడులు చేసారంటూ ఫిర్యాదు చేసారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనిమెట్లలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లిన కోడెల అక్కడ తలుపులు వేసుకొని రిగ్గింగ్ కోసం ప్రయత్నించినా ఆయన పై కేసు నమోదు చేయలేదని వివరించారు. వైసిపి నుండి మదనపల్లి అభ్యర్దిగా పోటీలో ఉన్న బాబు పైనా దాడి జరిగిందని..కురుపాం అభ్యర్ది పుష్ఫశ్రీ వాణిపై దాడి చేసారని జగన్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. గురజాలలో టిడిపికి ఓట్లు వేయలేదని మైనార్టీల పైన దాడులకు తెగ బడ్డారంటూ గవర్నర్కు ఫిర్యాదు చేసారు.మచిలీపట్నం స్ట్రాంగ్ రూంలో అభ్యర్దులకు సమాచారం లేకుండా వేరే వ్యక్తులు లోపలికి వెళ్లారని..ఇది నిబంధనలకు విరుద్దమని వివరించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలను మొహరించాలని జగన్ విజ్ఞప్తి చేసారు.
ఆధారాలను మాయం చేస్తున్నారు..
అపద్దర్మ ప్రభుత్వం ఉన్నా..వందలాది కోట్ల బిల్లులు విడుదల చేస్తున్నారని జగన్ ఆధారాలను గవర్నర దృష్టికి తీసుకెళ్లారు. తన అనుయాయులకు పెండింగ్ బిల్లులను అధికారుల మీద ఒత్తిడి తెచ్చి విడుదల చేయిస్తున్నారని ఫిర్యాదు చేసారు. అదే విధంగా అయిదేళ్ల కాలంలో చంద్రబాబు తాను చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఇటువంటి అంశాల మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా..వైసిపి నేతల పైన కేసులు బనాయిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూంల నుండి వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా సీఈవో కార్యాలయానికి అనుసంధానం చేయాలని జగన్ సూచించారు.
బైబై బాబు చెప్పేసారు..అందుకే ఇలా..
ఎన్నికల్లో ప్రజలు ముక్తకంఠంతో చంద్రబాబు పాలనకు బైబై చెప్పేసారని..అందుకే ఇప్పుడు ఈవీయంల పైన రాద్దాంతం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఓటేసిన 80 శాతం మంది ప్రజల్లో ఏ ఒక్కరూ తమ ఓటు పడలేదని.. తాము ఒక పార్టీకి ఓటు వేస్తే మరొక పార్టీకి వెళ్లిందని ఫిర్యాదు చేయలేదని..చంద్రబాబు మాత్రమే మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.2014 ఎన్నికల్లో ఆ తరువాత నంద్యాల ఎన్నికల్లో చంద్రబాబు గెలిచింది ఇవియంల ద్వారానే అనే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. తనకు అనుకూలంగా ఉంటే తన క్రెడిట్గా.. లేకుంటే మిగిలిన వారి తప్పుగా చిత్రీకరించటం చంద్రబాబుకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేసారు. ఏపిలో శాంతి భద్రతల మీదే ప్రధానంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు జగన్ వివరించారు.