అరెస్ట్ వారెంట్లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?
అమరావతి/ధన్బాద్: 2010 నాటి బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికే ఈ వారెంట్ చర్చనీయాంశంగా మారింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడం తదితర పరిణామాలు ఇందుకు కారణంగా, ఇది రాజకీయ కక్షగా కొందరు భావిస్తున్నప్పటికీ అసలు విషయం అది కాదని అంటున్నారు.
ఈ నోటీసులు ఏపీ సీఎంకే కాకుండా ప్రస్తుతం బీజేపీతో తెరాస స్నేహంగా ఉంటుందనే వాదనలు ఉన్నాయి. అలాంటి తెరాసలోని నేతలకు కూడా నోటీసులు వచ్చాయి. మరో ముఖ్యమైన విషయం ఏమంటే నోటీసులు ఇదే మొదటిసారి కాదని, గతంలోను నోటీసులు జారీ చేస్తే స్పందించని పరిస్థితుల్లో అన్ని కేసుల్లో మాదిరి ఇందులో కూడా నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు.
ఇదివరకు నోటీసులు పంపించినా చంద్రబాబు స్పందించలేదు
ఈ కేసుకు సంబంధించి అందరికి పలుమార్లు నోటీసులు పంపించామని ధర్మాబాద్ జడ్జి చెప్పారని అంటున్నారు. చంద్రబాబు సహా పదహారు మందికి నోటీసులు పంపించినప్పటికీ స్పందించలేదని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ చేశామని అంటున్నారు. ఈ నెల 21వ తేదీలోగా హాజరు కావాలని లేదంటే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు.
కలకలం: బాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ 15 మందికీ, కారణం ఇదే
అధికారులతో చర్చించిన చంద్రబాబు
చంద్రబాబు శ్రీవారి ఆలయంలో ఉండగానే మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు నోటీసుల వ్యవహారం అధికారికంగా తెలిసింది. ఆయన ఆలయం బయటకు రాగానే ఈ అంశాన్ని ప్రభుత్వ అధికారులు ఆయనకు తెలిపారు. శుక్రవారం దీనిపై ఆయన ఈ అంశంపై చర్చించారు.
అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసు యంత్రాంగం
చంద్రబాబు సహా పదహారు మందికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చంద్రబాబు కోర్టుకు హాజరైతే శాంతిభద్రతల పరిస్థితి ఏమిటనే అంశంపై చర్చిస్తోంది. అందుకు తగిన విధంగా చర్యలు చేపడుతోంది. చంద్రబాబు కోర్టుకు హాజరు అవుతారా లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతుందా చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా అరెస్ట్ వారెంట్ పైన తొలుత 21లోగా వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని ఉంది. ఆ తర్వాత 21వ తేదీ అని ఉన్న ప్రింట్ కొట్టివేసి ఆగస్ట్ 16వ తేదీ అని మళ్లీ రాశారు.
వారెంట్ ఉపసంహరించాలి
చంద్రబాబుపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉపసంహరించాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నారు. చంద్రబాబుకు వారెంట్ జారీపై ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలు చర్చించారు. ఒక సీఎంకు అరెస్ట్ వారెంట్ ఎలా జారీ చేస్తారని తెలుగుదేశం వర్గాలు మండిపడ్డాయి.