కి'లేడీ'లు...భలే బురిడి కొట్టిస్తారు:ఎట్టకేలకు చిక్కారు
తిరుపతి:జనాలకి తెలివిగా బురిడీ కొట్టిస్తూ బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలను తిరుపతి అర్బన్ క్రైమ్ పోలీస్స్టేషన్ మహిళా పోలీసులు అరెస్ట్ చేశారు.
విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను క్రైమ్ అదనపు ఎస్పీ సిద్ధారెడ్డి మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురు మహిళలు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చాలా చాకచక్యంగా మహిళల మెడలోని బంగారు గొలుసులు, వారి హ్యాండ్బ్యాగ్ల్లోని డబ్బులు చోరీచేసేవారు. అలాగే ఆటోల్లో తోటి ప్రయాణికుల్లా మెలుగుతూ మహిళల బంగారు ఆభరణాలు దొంగలించి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునేవారు. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్లోని అంబర్పేట్, పటేల్నగర్కు చెందిన తులసి అలియాస్ నిర్మల అలియాస్ సయ్యద్ రషీద్ బేగం(58), ఎం.లక్ష్మి అలియాస్ మీరున్నిసా(35), ఎం.సోని అలియాస్ రిజ్వాన(19) వీరు ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు హైదరాబాద్ ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలతో పాటు తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని యాత్రా స్థలాలు, పర్యాటక ప్రాంతాల్లో సంచరిస్తూ తోటి మహిళా ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు అపహరించడం చేసేవారు. ఈ గ్యాంగ్ కు తులసి నాయకత్వం వహించేది.
చోరీలే ప్రధాన వృత్తిగా చేసుకుని జీవించే కుటుండానికి చెందిన ఈ ముఠా నాయకురాలు తులసి లేదా ఆమె ఆమె కుటుంబం ఒకవేళ తాము పోలీసులకు పట్టుబడినా తన బంధువులు, ఇతరుల ద్వారా ఏర్పాటు చేసిన ముఠాలతో దొంగతనాలు కొనసాగేలా ప్రణాళికలు అమలుచేసేది. ఇక వీరు దొంగతనాలకు పాల్పడే పద్దతులు పోలీసులకు సైతం ఆశ్చర్యం కలిగించాయి.
దొంగతనాలకు వెళ్లే సమయంలో ఈ చోర శిఖామణులు అందరూ మొత్తం ఖరీదైన హోటళ్లలో దిగేవారు. ఉన్నత కుటుంబాల మాదిరి వేషధారణతో తిరుగుతూ హడావుడి చేస్తూ జనాలను బురిడీ కొట్టించి అదను చూసి ఆభరణాలు,డబ్బు నొక్కేసేవారు. వీరిపై ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వందకు పైగా కేసులు ఉన్నాయంటే వీరెంత కి'లేడీ'లో అర్థం చేసుకోవచ్చు. అలాగే వీళ్లు తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలో 2018, మేలో భవానీనగర్లోని ఓ మహిళ చైన్, రుయా ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, ఎస్వీయూనివర్సిటీ గేట్ ప్రాంతాలలో కూడా చైన్ దొంగతనాలకు పాల్పడ్డారు. 2017 తిరుచానూరు బ్రహ్మోత్సవాల సమయంలో ముగ్గురు మహిళల చైన్లను దొంగలించారు. మహిళలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వీరిపై కేసులు ఎక్కువయిపోవడంతో కొట్టేసిన నగలు అక్కడ అమ్మకుంటే పట్టుబడే అవకాశం ఉందని భావించి...తిరుపతిలో అమ్మి నగదు చేసుకోవాలని...అలాగే అక్కడే మరికొన్ని చోరీలు చేయాలనే ఉద్దేవ్యంతో తిరుచానూరు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఓ ప్రాంతంలో అనుమానాస్పదంగా వారు కనిపించడంతో క్రైమ్ సీఐ పద్మలత తమ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం నిందితురాళ్లను అదుపులోకి తీసుకుంది. వారిని విచారించగా వారి చోరీల విషయం బయటపడింది. వారి నుంచి రూ.6.42లక్షల విలువైన 214 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను ఈ రోజు రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.