అర్ధరాత్రి హైడ్రామా: అనంతపురం నుంచి షిఫ్ట్: వైఎస్ జగన్ ఇలాకాలోకి: విచారణ ఇక అక్కడి నుంచే
అనంతపురం: ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్మాల్ వ్యవహారంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జి అస్మిత్ రెడ్డిలను ఎట్టకేలకు కడపలోని కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతపురం జైలులో శిక్షను అనుభవిస్తోన్న ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో అదే కారాగారాంలో నేతలిద్దరినీ తరలించడానికి జిల్లా పోలీసు అధికారులు అంగీకరించలేదు.
రెండు, మూడు ప్రత్యామ్నాయ జైళ్లను పరిశీలించిన అనంతరం కడపకు తరలించారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి రెండువేలకు పైగా ప్రైవేటు బస్సుల ఉన్నాయి. వాటిల్లో చాలా బస్సులను ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. తమ వద్ద ఉన్న 154 బస్సులకు సంబంధించిన లైసెన్సులను జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. లారీలను నడిపించడానికి అనుమతులు తీసుకుని బస్సులను నడుపుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.
హైదరాబాద్లో వారిని అరెస్టు చేసి, అనంతపురానికి తీసుకొచ్చారు పోలీసులు. అనంతపురం జిల్లా న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో వారిని- అనంతపురం జైలుకు తరలించాలని తొలుత అధికారులు నిర్ణయించగా..అక్కడ ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా వారిని ఎక్కడ తరలించాలనే విషయంపై తర్జనభర్జనలు సాగాయి.
ఏ జైలుకు తరలించాలనే విషయంపై మరోసారి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. గుత్తి, గుంతకల్లు, కదిరి, కడప సెంట్రల్ జైలు వంటి ప్రత్యామ్నాయాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. కడప మినహా మిగిలిన పట్టణాల ఉప కారాగారాల్లో సౌకర్యాలు కొరత ఉందని భావించిన అనంతరం కడపకు తరలించడానికి న్యాయమూర్తి అనుమతించారు. దీనితో వారిద్దరినీ గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2:30 గంటల సమయంలో రోడ్డుమార్గంలో కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
Recommended Video
ఈ సమయంలో వారి వెంట- తాడిపత్రి, అనంతపురం డీఎస్పీలు శ్రీనివాసులు, వీరరాఘవ రెడ్డి సహా కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కడప కేంద్ర కారాగానికి చేరుకున్న అనంతరం అక్కడి అధికారులకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అప్పగించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయడానికి సుమారు 45 నిమిషాల సమయం పట్టినట్టు సమాచారం. అంతసేపు వారిద్దరూ ఖైదీలను కలవడానికి వచ్చే వారి బంధువులు, ఇతర కుటుంబీకులు నిరీక్షించడానికి కేటాయించిన గదిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.