అమరావతిపై అరుణ్ జైట్లీ కీలక ప్రకటన! రికార్డు సృష్టించిన రాజ్యసభ!
న్యూఢిల్లీ: అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 3,324 కోట్ల రుణం ఇచ్చే అంశం ప్రపంచ బ్యాంకు పరిశీలనలో ఉందని చెప్పారు.
ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాజ్యసభలో అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి అరుణ్ జైట్లీ స్పందించి వివరణ ఇచ్చారు.
రాజధాని నిర్మాణానికి రూ. 3324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందన్నారు. ఈ అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీలిస్తోందన్నారు. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన వెంటనే రుణం మంజూరు అవుతుందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే రూ. 1500 కోట్లు ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిందని కూడా అరుణ్ జైట్లీ వెల్లడించారు.
చరిత్ర సృష్టించిన రాజ్యసభ...
రాజ్యసభకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండానే మంగళవారం రాజ్యసభలో సమావేశాలు జరిగాయి. జీరో అవర్తో పాటు క్వశ్చన్ అవర్, ఇతర ఎజెండాలు కూడా అనుకున్నట్టుగానే జరిగాయి.
దీంతో రాజ్యసభ చరిత్ర సృష్టించిందని చైర్మన్ వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆ సమయంలో సభ్యులు హర్షాతిరేకాల మధ్య బల్లలు చరిచారు. సభ్యుల సహకారం బాగుందని, అందుకే సభ సజావుగా సాగిందని, అందుకే హౌస్లో ఈ రికార్డును నెలకొల్పామని వెంకయ్య అన్నారు.
భవిష్యత్తులోనూ సభ ఇలాగే సాగాలని ఆయన ఆకాంక్షించారు. అయితే గత కొన్ని రోజులుగా వివిధ కారణాల వల్ల సభ సజావుగా సాగలేదు. ఇవాళ సభలో మొత్తం పది ప్రశ్నలను చర్చించారు. జీరో అవర్ సబ్మిషన్తోపాటు మాజీ సభ్యుడు మరగబందు మృతి పట్ల నివాళి అర్పించారు.