దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు కౌంటర్: అవసరంలేని వివాదం.. అరుణ్ జైట్లీ
తిరువనంతపురం/న్యూఢిల్లీ: తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులు మంగళవారం భేటీ అయ్యారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ భేటీకి హాజరైన రాష్ట్రాల్లోను బీజేపీని వ్యతిరేకించేవి ఉన్నాయి. కర్నాటక, కేరళ, పుదుచ్చిరే, ఆంధ్రప్రదేశ్ రాష్టాలు హాజరయ్యాయి.
చదవండి: ఒక్క దెబ్బకు 3 పిట్టలు!: కార్నర్ చేసేందుకు చంద్రబాబు 'వీడియో' ప్లాన్
దక్షిణాది రాష్ట్రాల భేటీ సరికాదని చెబుతూ తెలంగాణ దూరంగా ఉంది. తమిళనాడు అధికారులను పంపి సరిపెట్టుకుంది. తిరువనంతపురంలో జరిగిన భేటీలో 15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం, కేంద్రం రాష్ట్రాల అధికారాలను హరిస్తున్న విధానం, 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
చదవండి: మోడీ చెప్పారు! త్వరలో శుభవార్త: హోదా కోసం శ్రీవారికి రాఘవేంద్ర రావు గడ్డం
రాజకీయాల కోసం రాలేదు
దీనిపై ఏపీ ఆర్థిక మంత్రి యనమల మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రాల సంబంధాల విషయంలో కేంద్రం నియంతలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయాల కోసం తాము ఇక్కడ సమావేశం కాలేదని, తమను ఎన్నుకున్న ప్రజల కోసమే మాట్లాడుతున్నామన్నారు. అధికారం ఇచ్చిన ప్రజల హక్కులను మేం కాపాడాలన్నారు. వాళ్ల ప్రయోజనాలు కాపాడేందుకు చాలా వనరులు కావాలన్నారు.
కేంద్రం నియంతలా వ్యవహరించవద్దు
మనకున్న వనరుల్లోనే ఇవన్నీ చేయాలని, మేం చేపడుతున్న పథకాలన్నింటికీ ఈ వనరులు సరిపోవని, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పరిమితమైందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యం పెంపొందించాలని, రాజ్యాంగ పరంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య సంక్రమించే ఆర్థికపరమైన సంబంధాలను సమీక్షించాలని, అవసరమైతే చట్ట సవరణ కూడా చేయాలని, అంతేకానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం నియంతలా వ్యవహరించరాదని యనమల అన్నారు.
అరుణ్ జైట్లీ పేస్బుక్ పోస్ట్
ఇదిలా ఉండగా, కొన్ని దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. కేంద్రం రూపొందించిన నిబంధనావళిని తప్పుబడుతూ దక్షిణాది రాష్ట్రాల మంత్రులు చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల రూపకల్పనలో ఒక ప్రాంతం పట్ల ఎలాంటి పక్షపాతం చూపలేదన్నారు. రాష్ట్రాల్లోని జనాభాకు తగిన అవసరాలు, జనాభా నియంత్రణలో సాధించిన పురోగతి మధ్య సమతుల్యం పాటించేలా నిబందనలు రూపొందించినట్లు చెప్పారు.
అనవసర వివాదం సృష్టించే ప్రయత్నం
15వ ఆర్థిక సంఘం నిబంధనలు ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ అనవసర వివాదం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆయా వాదనల్లో ఎలాంటి నిజం లేదని జైట్లీ చెప్పారు. అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు, పేద రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వచ్చేలా నిబంధనలు రూపొందించినట్లు వివరించారు. పన్నుల ఆదాయం పంపానికి 1971 జనాభా లెక్కలకు బదులుగా 2011 లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవడాన్ని జైట్లీ సమర్ధించుకున్నారు.
పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటా పెంచాముగా
14వ ఆర్థిక సంఘం 2011 లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచిందని జైట్లీ వెల్లడించారు. పన్నుల ఆదాయం పంపిణీకి 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవడం పట్ల మంగళవారం తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పన్నుల ఆదాయం పంపిణీకి 1971 జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకోవాలని సదస్సు డిమాండ్ చేసింది.