అరుణ్ జైట్లీ నోటి వెంట 7సార్లు 'నోట్ల రద్దు'
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో 'నోట్ల రద్దు' పలుమార్లు ఉచ్చరించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో 'నోట్ల రద్దు' పలుమార్లు ఉచ్చరించారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఆ నిర్ణయం తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దీని గురించి ఏడుసార్లు ప్రస్తావించారు.భారీ, స్వచ్ఛ, వాస్తవ జీడీపీకి కొత్త ప్రమాణం ఏర్పడటానికి తీసుకున్న అనేక చర్యల్లో పెద్ద నోట్ల రద్దు సాహసోపేతమైనది, దృఢ నిర్ణయమైనదన్నారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం భారీగా ఉంటుందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీ వృద్ధి పెరిగిందని, పన్ను వసూళ్ళు పెరిగాయన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులను సాధారణ స్థితికి చేర్చే యత్నాలు జోరందుకున్నాయన్నారు.
త్వరలోనే సాధారణ స్థాయికి పరిస్థితులు వస్తాయని, పెద్ద నోట్ల రద్దు ప్రభావం వచ్చే ఏడాదికి ఉండదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తగ్గినట్లయితే, దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తాత్కాలికంగానే ఉంటుందని అనుకున్నామన్నారు.
పెద్ద నోట్ల రద్దువల్ల అనధికారిక రంగంపై పడే ప్రతికూల ప్రభావం అధికారిక రంగంలో పెరుగుదలతో సమసిపోతుందని, ఎక్కువ పన్నుల వసూలైతే ప్రభుత్వ వ్యయం పెరుగుతుందన్నారు.