టీడీపీ పొలిట్ బ్యూరోలోకి గల్లా అరుణ కుమారి: అలా షాకివ్వడంతో.. కారణం అదేనా?
అమరావతి: తెలుగుదేశం పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారిని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలోకి తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గల్లా అరుణ కుమారి 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా పని చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గాల్లో కీలకమైన శాఖలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి, తన కుమారుడు గల్లా జయదేవ్ సహా తెలుగుదేశం పార్టీలో చేరారు. గత కొద్దికాలంగా ఆమె టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.
మరోవైపు, చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డికి ధీటైన నేత లేరని టీడీపీ భావిస్తోంది. ఇలాంటి సమయంలో తాను చంద్రగిరి నియోజకవర్గానికి ఇంచార్జిగా ఉండనని గల్లా అరుణ టీడీపీ అధినేతకు తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తన తనయుడు గల్లా జయదేవ్ను మరోసారి గెలిపించుకునేందుకు గుంటూరుపై దృష్టి సారించాల్సి ఉన్నందున తాను చంద్రగిరి నుంచి తప్పుకున్నట్లు ఆమె పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దానిని కారణంగా చూపించినప్పటికీ అసలు కారణం అసంతృప్తి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడం గమనార్హం. ఆమెను బుజ్జగించే చర్యల్లో భాగంగానే ఆమెను తీసుకొని ఉంటారని అంటున్నారు.