అరుణక్క: తండ్రిబాటలో నడిచిన కూతరు. 16 ఏళ్ళ క్రితమే మావోయిస్టు పార్టీలో చేరిక.
విశాఖ పట్టణం :ఒడిశా ఎన్ కౌంటర్ లో అరుణక్క మరణించింది. ఆమె కుటుంబమంతా మావోయిస్టు ఉద్యమంలోనే పనిచేశారు. తండ్రి, సోదరుడి బాటలో అరుణక్క కూడ మావోయిస్టులతో కలిసి పనిచేశారు.చివరకు ఒడిశా ఎన్ కౌంటర్ లో మరణించారు.
విజయవాడకు సమీపంలోని మహాంతిపురంకు చెందిన లక్ష్మణరావు, అర్జునమ్మ దంపతులకు ముగ్గురు సంతానం, చాల కాలం నుండి మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన లక్ష్మణరావు 16 ఏళ్ళ క్రితం జనజీవన స్రవంతిలో కలిశారు.లొంగిపోయిన తర్వాత తన మకాంను విశాఖ పట్టణం జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెంకు మార్చారు.
ఉన్నత విద్యను అభ్యసించిన లక్ష్మణరావు ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. తాజాగా ఒఢిశా లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన పెద్ద కుమార్తె చైతన్య మరణించింది.చైతన్య అలియాస్ అరుణక్క ఒడిశా మావోయిస్టు దళంలో కీలకంగా పనిచేశారు. 16 ఏళ్ళ క్రితమే ఆమె ఉద్యమంలోకి వెళ్ళింది.
ఉద్యమంలోకి వెళ్ళిన సమయం నుండి రెండు దఫాలు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడింది. లక్ష్మణరావు రెండో కుమార్తె ఝాన్సీ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు.హిందూజా పవర్ ప్లాంట్, గంగవరం పోర్టు పోరాటంలో ఆమె కీలకంగా వ్యవహారించారు.లక్ష్మణ్ రావు మూడో సంతానం గోపాల్ అలియాస్ ఆజాద్ .ఇంజనీరింగ్ వరకు చదువుకొన్నాడు.
ఆజాద్ యుక్తవయస్సు నుండి మావోయిస్టు ఉద్యమం వైపే నిలిచారు.2002 లో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరాడు 2006 లో మావోయిస్టులకు ఆయుధాలు, సాంకేతిక సామాగ్రిని సరఫరా చేస్తున్నాడనే అభియోగంతో విజయనగరంలో పోలీసులు అరెస్టు చేశారు.తచ్వాత గాలికొండ దళకమాండర్ గా పనిచేశాడు. గత ఏడాది మే 4వ, తేదిన జరిగిన ఎన్ కౌంటర్ లో ఆయన మరణించాడు.తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో అరుణ మరణించింది.