అమరావతికి వచ్చి బాబుతో రెండున్నర గంటలు మాట్లాడిన కేజ్రీవాల్, టీడీపీ నేతలు ఏమన్నారంటే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీ నుంచి నవ్యాంధ్ర రాజధానికి వచ్చి టీడీపీ అధినేతతో చాలాసేపు మాట్లాడి అనంతరం ఢిల్లీకి వెళ్లారు.
బీజేపీయేతర కూటమి, తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, కేజ్రీవాల్లు రెండున్నర గంటలకు పైగా చర్చించారు. జాతీయ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తొలిసారిగా అమరావతికి సీఎం కేజ్రీవాల్కు రావడంతో ఆయనకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నకేజ్రీవాల్ను మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమామహేశ్వర రావులు కలిసి స్వాగతం పలికారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కేజ్రీవాల్కు వివరించారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు ఉన్నారు
కాగా, ఇటీవల ఢిల్లీలో కేజ్రీవాల్ చేసిన దీక్షకు చంద్రబాబు మద్దతు పలికారు. ఢిల్లీకి వెళ్లి ఆ దీక్షలో కూర్చున్నారు. అంతకుముందు, చంద్రబాబు ఢిల్లీ నిరసన దీక్షలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఇటీవల బీజేపీయేతర పార్టీ అంటూ తెలుగుదేశం, కాంగ్రెస్, ఏఏపీ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలు ఒక్కటవుతోన్న విషయం తెలిసిందే.
చంద్రబాబు, కేజ్రీవాల్లు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో కలిసి రాజకీయ అంశాలపై చర్చించారని తెలుగుదేశం పార్టీ నేతలు తెలిపారు. ఇటీవల మమతా బెనర్జీ కోల్కతాలో బీజేపీయేతర పక్షాలతో భారీ సభను నిర్వహించారు. ఆ సభ అనంతరం మరో అలాంటి సభ నిర్వహించే అంశంపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. వారు బీజేపీయేతర కూటమి గురించే మాట్లాడుకొని ఉంటారని, కానీ కచ్చితంగా వారి మధ్య ఏం చర్చ జరిగిందో తెలియదని కొందరు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఏం చర్చ జరిగిందో ముందు ముందు తేలుతుందని చెప్పారు.