ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి రావాలి:మాజీ ముఖ్యమంత్రి రోశయ్య
గుంటూరు:ఆర్యవైశ్యులు రాజకీయాల్లోకి వచ్చిఆర్యవైశ్యులకు సముచిత న్యాయం జరిగేలా పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు లోని ఒక ప్రయివేటు కళ్యాణ మండపంలో ప్రపంచ ఆర్యవైశ్య మహా సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ ఆర్యవైశ్యులు తగాదాలకు దూరంగా ఉంటారన్నారు. అలాగే ఆర్యవైశ్యులు ఎక్కువగా రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకోరన్నారు. అయితే దీనిని గత ప్రభుత్వాలు బలహీనతగా తీసుకున్నాయన్నారు. మౌనంగా ఉన్నంత మాత్రాన ఆర్యవైశ్యులు పరిజ్ఞానం లేనివారని అనుకోవడం అవివేకమని రోశయ్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులు చేసిన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్యులంతా ఐక్యమై తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని రోశయ్య పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తర, దక్షిణ భారత ఆర్యవైశ్య అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహా సభా నిర్వహణ జరిగింది.