పార్లమెంట్ సాక్షిగా మాటిచ్చారు ... నిలబెట్టుకోండి.. కేంద్రానికి సీఎం జగన్ లేఖ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీకి విభజన హామీల్లో భాగంగా ఇస్తామని చెప్పిన ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి జగన్ లేఖ రాశారు. ఒక పక్క ఏపీలో ప్రత్యేక హోదా సాధిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ అప్పటి నుండి ప్రతి పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతూనే ఉంది. కేంద్రం మాత్రం పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తూనే ఉంది.
దిశా చట్టం 2019 బిల్లును వెనక్కు పంపి ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం..రీజన్ ఇదే
ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్
ఇక ఈ క్రమంలో తాజాగా పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోమారు సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం లేఖ రాయటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది . ఇక సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖలో విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు . మాటిచ్చారు నిలబెట్టుకోండి అని తన లేఖలో ప్రస్తావించారు సీఎం జగన్ .
రాష్ట్రం అనేక ఆర్ధిక ఇబ్బందులలో ఉందని మోడీకి లేఖ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తరువాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని , ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
తాజా బడ్జెట్ లోనూ ఏపీకి ఎలాంటి కేటాయింపులు లేవన్న జగన్
విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు . ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దృష్టికి తీసుకువస్తున్నానని , ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కోరారు సీఎం జగన్. ఏపీని ఆదుకోవటం కోసం కనీసం తాజా బడ్జెట్ లోనూ ఎలాంటి కేటాయింపులు చెయ్యలేదు . దీంతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఆర్ధిక వనరులన్నీ తెలంగాణాకే .. ఏపీ బాగా నష్టపోయింది
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. విభజన అనంతరం అత్యధిక ఆదాయం ఇచ్చే వనరుల ప్రయోజనాలు తెలంగాణకు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్ ఈ ఆదాయ వనరులను కోల్పోయింది. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించ కూడదని 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని లోక్ సభలో ఆర్థిక శాఖ చెప్పింది. కానీ ఆర్దిక సంఘం ప్రత్యేక హోదా తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేసింది. అది కేంద్రం పరిధిలోనిదని చెప్పింది.
పొంతన లేని సమాధానాలు చెప్తున్న ఆర్ధిక శాఖ ,ఆర్ధిక సంఘం .. చొరవ చూపాలని విజ్ఞప్తి
ఇక ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రజల అసంతృప్తిని , ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని, చొరవ చూపించాలని కోరారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .