ఇప్పటికీ ఏపీకి చంద్రబాబే సీఎం.. అందులో భాగమే ఈ తతంగం.. నిమ్మగడ్డపై కేసీఆర్కు కేంద్రం కీలక ఆదేశం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం పెనుదుమారానికి దారితీస్తున్నది. సీఎం జగన్, అధికార వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాసిన లేఖపై శుక్రవారం స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అది తాను రాయలేదని రమేశ్ చెబుతుండగా.. సదరు లేఖ కేంద్ర హోం శాఖకు అందిందని, ఎస్ఈసీ భద్రతపై కీలక ఆదేశాలిచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాంబు పేల్చారు. మరోవైపు ఏపీ ఎస్ఈసీ అనూహ్యంగా శుక్రవారం నుంచి హైదరాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీకి చంద్రబాబే సీఎం?
తనకు, తన కుటుంబానికి వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, ఏపీలో భ్రద్రత లేదని, నిత్యం బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కేంద్రానికి రాసిన లేఖలో ఆరోపణలు చేయడాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏపీకి ఇప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని చాలా కొంత మంది విశ్వసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలన్నీ అందులో భాగమేనన్నారు.
వింతేమీ లేదు..
‘‘చంద్రబాబును ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఊహించుకుంటున్నవాళ్లే.. తమకు ఏపీలో రక్షణ లేదని పీడకలలు కంటూ అకారణంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. బాబును సీఎంగా ఊహించుకున్నప్పుడు ఇలాంటి వెర్రి భయాలు కలగడంలో వింతేమీలేదు. ఎందుకంటే, ఆ ఊహాకారులందంరూ తమ యజమాని చంద్రబాబుకు ఇప్పటికీ ఏదో ఒక విధంగా సేవలు చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. ఈ లేఖలు, లీకుల తతంగమంతా అందులో భాగంగా జరుగుతున్నదే''అని ఎంపీ మండిపడ్డారు.
నిమ్మగడ్డ కేరాఫ్ హైదరాబాద్
ఏపీలో తనకు రక్షణ లేదని, ఏ నిమిషమైనా దాడి జరగొచ్చని కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్.. ఆ లేఖ తాను రాయలేదంటూనే బుధవారం రాత్రికిరాత్రే విజయవాడ నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. లేఖపై కేంద్ర హోం శాఖ నుంచి క్లారిటీ వచ్చిన కొద్దిసేపటికే ఆయన మరో అనూహ్య నిర్ణయాన్ని వెలువరించారు. ఇకపై నిమ్మగడ్డ హైదరాబాద్ నుంచే విధులు నిర్వహిస్తారని ఏపీ ఎస్ఈసీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దాంతోపాటు మరో ఆదేశాన్ని కూడా ఆయన జారీచేశారు.
సీఎం జగన్కు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో స్థానిక ఎన్నికల్ని ఆరు వారాలపాటు వాయిదా వేసిన సందర్భంలో ఆ గడువుకాలం మొత్తానికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందని, రాష్ట్రంలో ఎలాంటి కొత్త పథకాలు చేపట్టానికి వీల్లేదని కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారు. కానీ వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోడ్ ఎత్తేయాలని కోర్టు ఆదేశించడంతో బుధవారమే హుటాహుటిన ఆయన కోడ్ ఉపసంహరణ ఉత్తర్వులిచ్చారు. ఇక ఉగాది సందర్భంగా 26 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంచుతానన్న సీఎం జగన్.. ఆ పనిని నిరభ్యంతరంగా చేసుకోవచ్చంటూ ఎస్ఈసీ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపింది.
ఇకపై బాధ్యత కేసీఆర్దే..
రాష్ట్రం విడిపోయి ఏడేళ్లు కావొస్తున్నా.. విభజన సమస్యలు ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాకున్నా.. నిమ్మగడ్డ ఎపిసోడ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. ఏపీలో తనకు భద్రత లేదంటూ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేసిన నిమ్మగడ్డకు కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రస్తుతం ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నందున ఆయన సెక్యూరిటీ బాధ్యతలను కేసీఆర్ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని, ఆమేరకు చర్యలు తీసుకునన్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఏపీ సర్కారుపై ఆరోపణలు చేసిన కీలక అధికారికి తెలంగాణలో సెక్యూరిటీ కల్పించడం ఇదే తొలికావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.
Recommended Video
సీఎం జగన్ సీరియస్..
రాష్ట్రాన్ని అప్రదిష్టపాలు చేసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తున్న తీరుపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఏకంగా ఇప్పుడున్న రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ముగ్గురు కమిషనర్ లు ఉండే కొత్త వ్యవస్థ ఏర్పాటుకు ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. మాజీ సీఎం చంద్రబాబు.. వివిధ వ్యవస్థల్లో తాను నియమించుకున్న వ్యక్తుల ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపిస్తోన్న సీఎం జగన్.. ఈ విషయమై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ నిర్ణయాలు తెలుగు రాష్ట్రల్లో మునుపెన్నడూ చూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.