రాయలసీమ, గోదావరి జిల్లాలు: జగన్ను కార్నర్ చేసిన చంద్రబాబు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజైన బుధవారం నాడు వాడిగావేడిగా జరిగాయి. అసెంబ్లీ లాంజ్ నుంచి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో తొలగించడం, పట్టిసీమ ప్రాజెక్టులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది.
రెండో రోజైన మంగళవారం ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఒకింత పైచేయి సాధించినట్లుగా కనిపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మూడో రోజు మాత్రం తెలుగుదేశం పార్టీ పూర్తిగా కార్నర్ చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా పట్టిసీమ విషయంలో వైసిపిని అధికార పార్టీ నీళ్లు నమిలేలా చేసిందని అంటున్నారు.
కరువు తదితర అంశాల పైన వైసిపి సభాపతికి తీర్మానం ఇచ్చింది. వాటిని సభాపతి కోడెల శివప్రసాద రావు తిరస్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాంజ్లో వైయస్ ఫోటో తొలగించడాన్ని నిరసించింది. అయితే, వైయస్ పైన ప్రేమ ఉంటే తీర్మానం ఇచ్చి ఉండాల్సిందని, తీర్మానం ఇవ్వకుండా ఈ అంశం తేవడం ఏమిటని ప్రశ్నించారు.
ఆ తర్వాత పట్టిసీమ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వైసిపిని పూర్తిగా కార్నర్ చేశారని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. పట్టిసీమకు వైసిపి వ్యతిరేకమా? అనుకూలమా? సూటిగా చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు.
అయితే, దానిపై విపక్షం సూటిగా సమాధానం చెప్పలేదు. దీంతో, వైసిపి సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతున్న సమయంలో... చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పి మాట్లాడాలని హితవు పలికారు. బిజెపి సభ్యులు కూడా, సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి సరికాదని అభిప్రాయపడ్డారు.
తమను రాయలసీమ వ్యతిరేకులుగా టిడిపి చూపించే ప్రయత్నం చేస్తోందని, కానీ పట్టిసీమ ప్రాజెక్టులో ధనార్జన ధ్యేయంగా కనిపిస్తోందని వైసిపి ఆరోపించింది.
అయితే, అక్రమాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామని, అంతకుముందు పట్టిసీమకు వ్యతిరేకమా లేక అనుకూలంగా సూటిగా సమాధానం చెప్పాలని చంద్రబాబు ఒకటికి రెండుసార్లు నిలదీశారు. తమకు మెజార్టీ ఇచ్చిన గోదావరి జిల్లాలను మర్చిపోమని, వారికి పూర్తిగా నీరు ఇచ్చాకే మిగతా జిల్లాలకు తరలిస్తామన్నారు.
వృథాగా పోతున్న నీటినే పట్టిసీమ ద్వారా రాయలసీమకు ఇస్తున్నామని చెప్పారు. 2018లో పోలవరం పూర్తవుతుందని, అప్పటిదాకా రాయలసీమకు నీళ్లు వద్దా చెప్పాలని వైసిపిని ప్రశ్నించారు. పట్టిసీమపై చర్చలో చివరలో చంద్రబాబు మాట్లాడారు.
ఆ సమయంలోను చంద్రబాబు వైసిపిని టార్గెట్ చేశారు. ముఖ్యమైన టాపిక్ మాట్లాడుతుండగా.. శాసన సభలో కనీసం నలుగురైదుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేరని, కనీసం రాయలసీమ సభ్యులు కూడా లేరని కౌంటర్ చేశారు.