పెద్దగట్టు జాతర షురూ -4రోజులు విజయవాడ-హైదరాబాద్ హైవే మళ్లింపు -5రాష్ట్రాల భక్తులు -ఇవీ విశేషాలు
దేశంలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనం మేడారం జాతర కాగా, తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర పేరుగాంచింది. సూర్యాపేటలోని పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. దురాజ్పల్లి పెద్దగట్టు జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రానుండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతర జరిగే 4రోజులపాటు విజయవాడ-హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ను మళ్లించారు..
కరోనా విలయంలో చైనా అద్భుతం -ఆకలి కేకలు సమాప్తం -కడు పేదలు లేరంటూ జిన్పింగ్ ప్రకటన
హైవే దారి మళ్లింపు ఇలా..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతుల స్వామి ఆలయం నెలకొని ఉంది. జాతర సందర్భంగా 65వ జాతీయ రహదారిపై ఆదివారం నుంచి భారీ వాహనాలను దారి మళ్లించారు. మార్చి4 వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విజయవాడకు వెళ్లే వాహనాలు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి నుండి నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ వైపు దారి మళ్లించారు. అలాగే, విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద హుజూర్నగర్ మీదుగా మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి వైపు దారి మళ్లించారు. కాగా,
5రాష్ట్రాల భక్తుల రాక
మేడారం సమ్మక్క- సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దదైన 'పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర' రెండేళ్లకోసారి జరుగుతుంది. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. తెలుగు రాష్ట్రాలేకాదు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో జాతరకు వస్తారు. భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని, భక్తులు స్నానం చేయడానికి షవర్లు, అతిథి గృహాలను కూడా అందుబాటులో ఉంచామని, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్త్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
పెద్దగట్టు జాతకు ప్రత్యేక బస్సులు
సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 70 బస్సులను జాతరకు ప్రత్యేకంగా నడుపుతున్నారు. పెద్దగట్టు జాతర కోసం కేసీఆర్ సర్కారు ప్రత్యేక నిధులు కేటాయించారు. కోవిడ్ నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు మున్సిపల్ యంత్రాంగం 600 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. జాతర ప్రాంగణంలో ఏడు అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 200 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 40 సీసీ కెమెరాలు, రెండు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఇక..
యాదవుల ఆరాధ్య దైవం..
దురాజ్ పల్లి పెద్దగట్టలో కొలువైన లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం అయినప్పటికీ కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా లక్షల సంఖ్యలో జనం జాతకు వస్తుంటారు. శనివారం అర్ధరాత్రి తర్వాత గంపల ప్రదక్షిణతో జాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను యాదవ కులస్తులు ఊరేగింపుగా తీసుకువస్తారు. కాలినడకన బయలుదేరి దురాజ్పల్లిలో ఉన్న పెద్దగట్టుకు రాత్రి చేరుకున్నారు. గంపలతో ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. మెంతబోయిన, గొర్ల, మున్న వంశస్తుల సమక్షంలో రెండు బోనాలు వండి పూజలు నిర్వహించారు. ఇంకా..
మకర తోరణం ఊరేగింపుతో ముగింపు..
ఆదివారం (మార్చి 1న) మొదలైన పెద్దగట్టు జాతర ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలిరోజు గంపల ప్రదక్షిణతో జాతర ఆరంభంకాగా, రెండో రోజైన సోమవారం చౌడమ్మకు బోనాలు, మొక్కులు సమర్పిస్తారు. మూడో రోజు మంగళవారం చంద్రపట్నం వేడుకను నిర్వహిస్తారు. ఇక నాలుగో రోజైన బుధవారం నెలవారం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆతర్వాత ఐదోజైన గురువారం మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగుస్తుంది. ఈ నాలుగు రోజుల పాటు హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రాకపోకలను దారిమళ్లించారు.
ys sharmila పార్టీలోకి ఇద్దరు మాజీ మంత్రులు -ఒకరు ఫైర్ బ్రాండ్ -ఉద్యమాల పురిటిగడ్డ నుంచి..