ఆ నలుగురూ టీడీపీలోనే..! ఫలించని వైసీపీ మంత్రాంగం: సీఎం నిర్ణయమే కారణమంటూ..!
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయానికి టీడీపీలో ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో జంప్ అవుతారంటూ కొంత కాలం ప్రచారం సాగుతోంది. అయితే, తాజాగా టీడీపీ నుండి నలుగురు మాత్రం జంప్ అవటానికి సిద్దంగా ఉన్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. అందులో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు..గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేగా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు మాత్రం టీడీపీ నుండి ఆ నలుగురు జంప్ అవ్వటానికి ఇప్పటికైతే సిద్దంగా లేరనే విషయం స్పష్టమవుతోంది.
మాజీ మంత్రి గంటా సైతం తన పార్టీ మార్పు పైన చాలా కాలంగా వార్తలు వస్తున్నాయని..అటువంటి సమాచారం ఉంటే తాను స్పష్టం చెబుతానని మరోసారి చెప్పుకొచ్చారు. ఇక, టీడీపీ నుండి ఇప్పటికే సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే మినహా..మరెవరూ ఇప్పటికిప్పుడు అయితే వైసీపీతో కలవటానికి సిద్దంగా లేరని తెలుస్తోంది. అదే విధంగా బీజేపీ నేతలు చెబుతున్నట్లుగానూ.. టీడీపీ నుండి తక్షణం పార్టీ మారే వారు కనిపించటం లేదు. కొంతమందిలో ఆలోచన ఉన్నా..ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటనే అడ్డుగా ప్రచారం జరుగుతోంది.
ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీతోనే...
కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లాలోని టీడీపీ నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో..ముగ్గురు వైసీపీతో టచ్ లో ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను చంద్రబాబుకు లేకుండా చేయటమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి బలం చేకూరే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా కనిపించటం లేదు. తాజాగా, మంగళగిరి వద్ద టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభానికి ప్రకాశం జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారిలో ఇప్పటికే కరణం బలరాం తన ట్విట్టర్ ద్వారా పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. మరో..ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ క్వారీల పైన దాడులు చేసి..పార్టీలో చేర్చుకొనేందుకు ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఆయన సైతం చంద్రబాబు వద్దకు వచ్చారు. మిగిలిన ఇద్దరు సైతం టీడీపీలోనే కొనసాగుతారని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా ఎమ్మెల్యేపై ఒత్తిడి..
గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను వైసీపీలోకి రావాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతలతో పాటుగా.. సత్యప్రసాద్ సోదరి ప్రముఖ వైద్యురాలు కావటంతో ఆమె ద్వారా సైతం ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈ ఎమ్మెల్యే టీడీపీ నూతన కార్యాలయం ప్రాంభోత్సవంలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే తాను పని చేస్తానని స్పష్టం చేసారు. ఇక, విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు సైతం తాను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్న బయటకు చెబుతానని స్పష్టం చేసారు. అయితే, ఆయన గత నెలలో ఢిల్లీలో రాం మాధవ్ ను కలవటం ద్వారా బీజేపీలో చేరటం ఖాయమనే ప్రచారం సాగింది. ఆయనతో పాటుగా విశాఖకు చెందిన మరో ఇద్దరు సైతం బీజేపీలో చేరుతారంటూ వార్తలు వచ్చాయి. ఇక, ఇప్పుడు గంటా వ్యాఖ్యల ద్వారా ఇప్పటికైతే పార్టీ మార్పు లేనది స్పష్టమవుతోంది.
సీఎం నిర్ణయమే కారణమంటూ...
టీడీపీ నుండి కొంత మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ ఇప్పటికీ వైసీపీ..బీజేపీ నేతలు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఆరు నెలలే కావటం..ఇప్పుడు పార్టీ మారితే అనర్హత వేటు..తిరిగి ఎన్నికల్లో పోటీ చేయటం వంటి వాటికి సిద్దంగా లేని కారణంగానే..మరి కొంత కాలం వేచి చూసే ధోరణితో ఉన్నారని చెబుతున్నారు. జనవరి..ఫిబ్రవరిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగనున్నాయి. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా పార్టీల నుండి చేరికల అంశం పైన క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తరువాతనే రాజకీయంగా కొత్త సమీకరణాలకు తెర లేచే అవకాశం కనిపిస్తోంది.