విమాన ఛార్జీలను మించిన బస్సు ఛార్జీలు...ఫ్లయిట్ ప్యాసింజర్లకు...సంక్రాంతి "స్పెషల్ ఛార్జీల" సెగ
అమరావతి: పండుగ వచ్చిందంటే రవాణారంగానికి "పండుగే"... ప్రైవేటు ట్రావెల్స్ వాళ్లే కాదు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా స్పెషల్స్ పేరుతో ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి.
సంక్రాంతి పండుగ నాడయినా సొంతవారితో గడుపుదామని స్వస్థలాలకు తరలివచ్చే ప్రయాణికులు స్పెషల్ ఛార్జీల పేరిట నిలువు దోపిడికి గురవుతున్నారు. ఇక ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు బస్సు ఛార్జీలను అమాంతం పెంచేసి ఎయిర్ బస్సుల ఛార్జీలను మించేలా చేస్తున్నారు. అటు ఆర్టీసీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్కు ఏమాత్రం తీసిపోకుండా తన వంతు తాను భారీగానే దోచుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోకపోవడంతో ప్రయాణీకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో భారమైనా అత్యధిక ధరలకు టికెట్లు కొని ఉసూరు మొహాలతో ప్రయాణాలు చేస్తున్నారు.
బస్సు ఛార్జీలా...లేక...ఎయిర్ బస్సు ఛార్జీలా...
హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్లాలంటే 3 వేల రూపాయలు...వైజాగ్ వెళ్లాలన్నా అంతే...ఇక రాజమండ్రికి రూ.2వేలు...భీమవరానికి రూ.1600... ఏలూరుకు రూ.2వేలు వసూలు చేస్తున్నారు. ఈ రేట్లు హఠాత్తుగా చూస్తే ఏమనిపిస్తోంది...ఊళ్ల పేర్లు లేకపోతే ఎవరైనా ఇవి ఖచ్చితంగా ఫ్లయిట్ ఛార్జీలే అనుకునేలా ఉన్నాయి...
పట్టనట్లు ప్రభుత్వాలు...అనుమానాలు...
పండగ వేళ ప్రయివేట్ ఆపరేటర్ల తోపాటు ఆర్టీసీ సంస్థల స్పెషల్ బాదుడుకు అడ్డుకట్ట వేయాల్సిన తెలుగు సర్కార్లు పట్టనట్లు ఉండటమే ప్రయాణికులకు బాధ కలిగిస్తోంది. బస్సు ఛార్జీల ధరలు ఇంతలా పెంచినా వాటి నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కనీసం ఇప్పటివరకు రవాణా అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. బస్సుల దోపిడీ పై దృష్టి సారించలేదు. వీటిని నియంత్రించేందుకు ఎక్కడా ఎలాంటి తనిఖీలు చెయ్యడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు గత్యంతరం లేక..వేరే దారి లేక తమకు ఎంతో భారమైనా అధిక ధరలు చెల్లించి ప్రయాణాలు చేస్తున్నారు.
స్పెషల్ రైళ్లలో...స్పెషల్ బాదుడు
సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే...సాధారణ రైళ్ల కంటే ఈ రైళ్లలో చార్జీలు అధికంగా ఉంటాయి.
విమాన ప్రయాణికులకు కూడా...పండుగ ఛార్జీల సెగ...
అయితే బస్సులు, రైళ్లే కాదు, విమానాల ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేయడమే ఈసారి విపరీత పరిణామం. పండగ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు టికెట్ల రేట్లను ఏకంగా 4 రెట్లు పెంచేశాయి. అన్ని ఫైట్ల రేట్లు ఇంచుమించు ఇలాగే ఆకాశాన్ని అంటుతున్నాయి. మామూలు రోజుల్లో హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రికి వెళ్లే ఫ్లైట్స్ 3వేల నుంచి 3వేల 500 ఉంటే ఇప్పుడు కనీసం 15 వేల నుంచి 17 వేలకు పెంచేశారు. అలాగే హైదరాబాద నుంచి విజయవాడ, తిరుపతి ఛార్జీలు మామూలు రోజుల్లో 2వేల 500 నుంచి 3 వేలు ఉంటే ప్రస్తుతం 10 వేల నుంచి 12 వేలు చేసేశారు. ఈ దారుణ దోపిడీ పట్ల ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, రైళ్లు దొరక్క డబ్బులు ఎక్కువైనా ఫ్లైట్లో వెళ్దామనుకుంటే వీటి రేట్లు ఇలా ఏకంగా 4 రెట్లు పెంచేయడం ఏమిటని, ఇది అన్యాయమని ఆక్రోశిస్తున్నారు. సొంత ఊరికి వెళ్లడానికి కష్టపడి సంపాదించిందంతా ఖర్చు పెట్టాల్సిరావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.