సొంత ఊళ్లో వైసీపీ ఓటమిపై మంత్రి కొడాలి నాని అనూహ్య స్పందన -హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో గతేడాది స్థానిక ఎన్నికల ప్రహాసం మొదలైనప్పటి నుంచి మంత్రి కొడాలి నాని అందరికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను వ్యక్తిగతంగా దూషించడం మొదలు, ఎస్ఈసీ రాజీనామా చేసి టీడీపీలో చేరిపోవాలంటూ అనేక సంచలన కామెంట్లు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మంత్రి తన పంథాను కొనసాగించడంతో ఆయనపై కేసు నమోదుకు ఎస్ఈసీ ఆదేశాలిచ్చారు. నిమ్మగడ్డ వర్సెస్ నాని అన్నట్లుగా వివాదాలు సాగుతుండగా.. మంత్రి స్వగ్రామంలో జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ చిత్తుగా ఓడటం సంచలనం రేపింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలువురు విమర్శలు గుప్పించగా, వాటిపై మంత్రి నాని రియాక్ట్ అయ్యారు. మరోవైపు నాని వ్యవహారంలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది..
వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం
అసలేం జరిగిందంటే..
మొత్తం నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకు గానూ ఆదివారం నాటికి రెండు దశల ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఓవరాల్ గా వైసీపీ బలపర్చిన అభ్యర్థులు ప్రభంజనం సృష్టించగా, మిగతా చోట్ల కంటే కృష్ణాజిల్లాలో ప్రతిపక్ష టీడీపీ ఎక్కువ సీట్లు సాధించింది. ప్రధానంగా మంత్రి కొడాలి నాని సొంత గ్రామంలోనూ తాము గెలిచినట్లు టీడీపీ సంబురాలు చేసుకుంది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీపై టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. మిగిలిన ఒక్క వార్డులోనూ వైసీపీ మద్దతు పలికిన అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలవడం గమనార్హం. ఈ గెలుపుపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంబురాలు చేసుకోగా, చంద్రబాబు సైతం ఘాటుగా స్పందించారు..
బూతుల మంత్రి సొంతూరులో గెలిచాం..
వైసీపీ ప్రభుత్వ పతనానికి పంచాయతీ ఎన్నికలు నాంది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందని ధ్వజమెత్తారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు పోరాడారని కొనియాడారు. మంత్రుల స్వగ్రామాల్లో వైసీపీని ఓడించారని తెలిపారు. మంత్రి గౌతంరెడ్డి సొంతూరులో వైసీపీ ఓడిందని, కొడాలి నానిని బూతుల మంత్రిగా అభివర్ణిస్తూ, ఆయన సొంతూరులోనూ టీడీపీ గెలిచిందని చంద్రబాబు తెలిపారు. టీడీపీ చొరవ వల్లే 82 శాతం పోలింగ్ పెరిగిందని, మొత్తంగా 40 శాతం మంది టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే..
యలమర్రు నా సొంతూరు కాదు..
మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే చేదు అనుభవం ఎదురైందంటూ వెల్లువెత్తుతోన్న వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. ''యలమర్రు నా సొంత గ్రామం కాదు.. నా పూర్వికులది. యలమర్రులో నేనెప్పుడూ రాజకీయాలు చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు మెప్పు కొసం కొందరూ నా సొతూరిగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలకు విరుద్ధంగా మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి'' అని మండిపడ్డారు. అంతేకాదు..
ఈనెల 21 తర్వాత తేలుస్తా..
ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే కాకుండా, ఎస్ఈసీ ఆదేశాలను సైతం బేఖాతరు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రిపై ఐపీసీ 504, 505(1)(సీ), 506 కింద కేసులు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్బాబును ఎస్ఈసీ ఆదేశించడం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా, సామాజిక శాంతికి భంగం వాటిల్లేలా, అధికారులను బెదిరిం చే ధోరణిలో మంత్రి నాని వ్యాఖ్యలు చేశారని, అందుకే ఈ చర్యలకు ఉపక్రమించామని ఎస్ఈసీ పేర్కొంది. తన మీడియా సమావేశాలపై ఆంక్షలు ఉన్నందున.. యలమర్రు సహా కృష్ణా జిల్లాలో పంచాయితీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడే మాట్లాడబోనని, ఆంక్షలు ముగియనున్న (ఈనెల) 21 తర్వాత వాస్తవాలను మీడియాకు వెల్లడిస్తానని, అందరి సంగతి తేలుస్తానని మంత్రి నాని అన్నారు. మరోవైపు..
నిమ్మగడ్డపై నాని న్యాయ పోరాటం..
తనపై కేసు నమోదు చేయాలంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని న్యాయపోరాటికి దిగారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను కొట్టేయాలంటూ కొడాలి నాని హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆదివారం దానిపై విచారణ జరిగింది. కొడాలి నాని ఏమీ అనకుండానే.. ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించిందని నాని తరఫు న్యాయవాది వాదించారు. ఎస్ఈసీ తరఫు న్యాయవాది మాత్రం.. నాని, ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియో చూశాకే ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ దశలో.. పిటిషన్కు వీడియో టేపులు జతపరిచారా అని కోర్టు ప్రశ్నించింది. టేపులు లేవని చెప్పడంతో కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. టేపులు సమర్పించాలని ఇరు న్యాయవాదులకు హైకోర్టు ఆదేశించింది. సోమవారం హైకోర్టు టేపులను పరిశీలించనుంది.
Recommended Video
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి