ఫేస్బుక్లో ప్రచారం: సీసీఎస్లో అసదుద్దీన్ ఫిర్యాదు
హైదరాబాద్: కొంతకాలంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో తనపై జరుగుతున్న ప్రచారాలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ పోలీసులను ఆశ్రయించారు. శనివారం ఆయన హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు.
తన పరువుకు భంగం కలిగించేలా ఫేస్బుక్లో అసత్య ప్రచారం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిని చట్ట ప్రకారం శిక్షించాలని ఫిర్యాదు చేశారు.
అసదుద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సిసిఎస్ సైబర్ క్రైం ఎసిపి బి అనురాధ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎంపికి సంబంధించి ఫేస్బుక్లో ఉన్న కథనాల్ని తొలగించామని చెప్పారు. ఈ ప్రచారాల వెనక ఎవరున్నారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించనట్టు ఆమె తెలిపారు.
కాగా, భారత ముస్లింల గురించి తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు పత్రికలో వచ్చిందని, హిందీ పోస్టర్పై తన చిత్రంతో పాటు తాను కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు వార్తాకథనం ప్రచురితమైందని, ఈ విషయంపై తనను చాలా మీడియా మిత్రులు ప్రశ్నించారని అసద్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.
ఆ కరపత్రంతో తనకు ఏ విధమైన సంబంధం లేదన్నారు. తాను ఏ విధమైన విద్వేషపూరితమైన ప్రకటన చేయలేదన్నారు. ఆ విధమైన రెచ్చగొట్టే కరపత్రాన్ని ఎవరు పంపిణీ చేశారో తనకు తెలియదన్నారు. ఈ కథనం వచ్చిన జమ్మూ అబ్జర్వర్ పత్రిక తనకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.