ఏపీకి అసని అలర్ట్: తీవ్ర తుఫానుతో భారీ వర్షాలు ప్రజలు, మత్స్యకారులకు హెచ్చరిక
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుఫాను క్రమంగా బలపడుతోంది. విశాఖకు ఆగ్నేయంగా 970 కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయ్యింది. రాగల ఆరు గంటల్లో తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మే 10వ తేదీ నాటికి క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చిన అనంతరం ఇది దిశ మార్చుకుంటుందని తెలిపింది.
అనంతరం ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం చేరే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. తీవ్ర తుఫాన్ ప్రభావంతో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని.. గురువారం వరకు మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్ళరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి గంటకు 105 కి.మీ నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానున్నట్లు తెలిపారు.10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీరప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని సాగనుంది. తుపాను ప్రభావంతో కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.