రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల సంబరాలు: వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు!
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు మంగళవారం సంబరాలు చేసుకుంటున్నారు. పలు జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. కేక్లను కట్ చేసి, పరస్పరం అభినందనలు తెలియజేసుకుంటున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అక్రిడేటేడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) వర్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా పెంచిన విషయం తెలిసిందే. ఇదివరకు 3000 రూపాయలు మాత్రమే ఉన్న వారి వేతన మొత్తాన్ని ప్రభుత్వం 10 వేల రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే. తమ వేతనాలను 6000లకు పెంచాలంటూ గత ప్రభుత్వ హయాంలో ఆశా వర్కర్లు ఆందోళనలు కూడా చేశారు. అయినప్పటికీ ఫలించలేదు. అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల వేతనాలను 10 వేల రూపాయలకు పెంచుతానని తన పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు.
అనూహ్యంగా తమ వేతనాలు పెరిగిపోవడంతో ఆశా వర్కర్లు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలను తెలుపుకొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ఎన్.సురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా వర్కర్లు సమావేశం అయ్యారు. తమ వేతనాలు పెంచడంపై వారు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ తీర్మానం చేశారు. వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కర్నూలు జిల్లా గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా వర్కర్లు ముఖ్యమంత్రి చిత్రపటం ఎదురుగా కేక్ కట్ చేసి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.