బాధపడ్తే లాభం లేదని ఆరడుగుల బుల్లెట్, కిరణ్కి వంత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము శక్తికి మించి పోరాడామని, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని, సీమాంధ్రలో నష్టాన్ని పూడ్చుకుందామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు శనివారం అన్నారు. కాంగ్రెసు, బిజెపిలను చిత్తుగా ఓడించాలని ఈ ఆరడుగుల బుల్లెట్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏ ఉద్యమంలోనైనా చిన్న చిన్న తప్పులు చోటుచేసుకుంటే వాటిని పెద్దవిగా చేసి చూపించడం ఆచారమని, సమైక్యాంధ్ర ఉద్యమం కూడా అందుకు మినహాయింపు కాదన్నారు. ఉద్యోగులు నిజాయితీగా పోరాడారన్నారు. ప్రజలు ఓడిపోతే, రాజకీయ నాయకులు గెలిచారన్నారు. ఆ రోజు ఎంపీలు రాజీనామాలు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని అయినా ఇప్పుడు తప్పులను తవ్వుకోవడం వృధా అన్నారు.
అణుబాంబులు పడ్డా జపాన్ కుంగిపోలేదని, ఆంధ్రప్రదేశ్ కూడా అందుకు తీసిపోదని, చేతికి వచ్చిన పంట కొట్టుకుపోతే రైతు పడే బాధ వంటిదే తమ బాధ కూడా అని అశోక్బాబు వ్యాఖ్యానించారు. కిరణ్ చివరి వరకు పోరాడుతామన్నారు కదా అని ప్రశ్నించగా అసలు అంపైర్ మోసం చేశారన్నారు.
ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని, రాష్ట్ర విభజన నేపధ్యంలో సీమాంధ్ర ప్రాంతాలకు జరిగే నష్టాలను పూడ్చుకునే క్రమంలో రానున్న ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందన్నారు. పది పదిహేను సంవత్సరాలు తీవ్రంగా కష్టపడితే తప్ప ఆర్థికంగా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినా ఉద్యోగుల ప్రయోజనాలకు నష్టం జరగకుండా పోరాడతామన్నారు.