హైదరాబాద్ పిల్లల స్థానికతేమిటి?: అశోక్ బాబు
నెల్లూరు: హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల స్థానికేతర సమస్యను పరిష్కరించాలని ఏపీ ఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్బాబు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నెల్లూరులోని ఎన్జీవో హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాన్లోకల్ సమస్యపై గవర్నర్తో సీఎం చర్చించి, ప్రత్యేక జీఓను విడుదల చేయాలన్నారు.
నూతన రాజధానికి వచ్చి విధులు నిర్వహించేందుకు ఉద్యోగులంతా సిద్ధంగా ఉన్నారనీ, అయితే అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. నివాస సౌకర్యాలకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలన్నారు. రాష్ట్ర రాజధానిని దశలవారీగా మార్చాలని చెప్పారు. భార్యాభర్తలు ఇరువురూ హైదరాబాద్లో ఉద్యోగులుగా ఉంటే వారికి కొంత వెసులుబాటు కల్పించాలని కోరారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం వేతనాల ఫిట్మెంట్ ఇవ్వడంలో ముఖ్యమంత్రిది సాహసోపేత నిర్ణయమని కొనియాడారు. మౌలిక వసతులు కల్పిస్తే ఏ ప్రాంతంలోనైనా విధులు నిర్వహించటానికి ఉద్యోగులు సిద్ధమని అశోక్బాబు అన్నారు. ప్రభుత్వం చెప్పిన ఏ బాధ్యత నిర్వహించడానికైనా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని, తమకు వౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. ఈ విషయాలను ఇదివరకే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
ఫిట్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపారన్నారు. సంఘం ప్రధానంగా ఏపి ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు చేయాలని, అనిశ్చితి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. హెల్త్కార్డుల వినియోగంలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు.