అశోక్కు సుబ్బరాయన్ సెగ: ఎపిఎన్జీవోలో విభేదాలు
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఎపిఎన్జోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్బాబుకు వ్యతిరేకత ఎదురైంది. ఏపీఎన్జీవోలో విభేదాలు బయటపడ్డాయి. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని మాజీ ఏన్జీవో ప్రధానకార్యదర్శి సుబ్బరాయన్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
అశోక్బాబు రాజకీయ పార్టీని ఎందుకు రిజిస్టర్ చేశారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘంలో ఉంటారో, రాజకీయాల్లోకి వెళ్తారో అశోక్బాబు చెప్పాలన్నారు. రాజకీయాల కోసమే ఉద్యమాన్ని నీరు గార్చారని ఆయన మండిపడ్డారు. విరాళాలకు లెక్కలు చెప్పాలని సుబ్బరాయన్ డిమాండ్ చేశారు. ఈ స్థితిలో విభజనను ఆపలేం కాబట్టి సహకరిస్తామని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరు గార్చిన ఘనత అశోక్బాబుదేనని ఆయన అన్నారు. చారిత్రాత్మకమైన ఎపిఎన్జీవోల సంఘం ప్రస్తుతం అసమర్థ నాయకత్వంలో నడుస్తోందని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజానాల కోస, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సమైక్య ఉద్యమాన్ని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. రాజకీయ నేతలను కూడా ఉద్యమంలోకి రానీయలేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలను కలుపుకోకపోతే విభజన బిల్లును శానససభలో, పార్లమెంటులో అడ్డుకునేది ఎవరని ఆయన అడిగారు.
ఒక్క ఉద్యోగుల సంఘం ఉద్యమం చేస్తే రాజకీయ నిర్ణయం మారుతుందా అని ఆయన ప్రశ్నించారు. అశోక్ భాబుకు ఈ మాత్రం ఇంగిత జ్జానం లేదా అని అడిగారు. అశోక్ బాబు దిశానిర్దేశం లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. అశోక్ భాబు కేవలం ఒక్క రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఉద్యమాన్ని చూసి అశోక్ బాబు పాఠాలు కూడా నేర్చుకోలేదని ఆయన అన్నారు. అశోక్ బాబు కనీసం రాజకీయ జెఎసిని కూడా నిర్మించలేదని అన్నారు.