బీజేపీకి అప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా? నేను అలా చెప్పలేదు: అశోక్ బాబు కౌంటర్
అమరావతి/బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు ప్రచారం చేయడం వివాదం అవుతోంది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఓ పార్టీకి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ప్రచారం చేయడంపై బీజేపీ మండిపడుతోంది. ఆయన తీరుపై బీజేపీ నేతలు మాణిక్యాల రావు తదితరులు మండిపడ్డారు.
దీనిపై అశోక్ బాబు మంగళవారం కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్జీవోల మద్దతు కోరినప్పుడు బీజేపీకి నిబంధనలు గుర్తుకు లేవా అని ప్రశ్నించారు. తాను బెంగళూరులో ఏర్పాటు చేసిన సమావేశంపై విమర్శలు సరికాదన్నారు. తన సమావేశంపై ఈసీ పిలిచి వివరణ కోరితే సమాధానం చెబుతానన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని తాను చెప్పానని, ఎవరికి ఓటు వేయాలో చెప్పలేదన్నారు. నిబంధనలు మాకు తెలుసునని, మరొకరు చెప్పాల్సిన పని లేదన్నారు. చవకబారు రాజకీయాలు వద్దన్నారు.
అందుకు బీజేపీ కుట్ర, ప్రభుత్వాన్ని తోసేయాలనే: శివాజీ సంచలనం, ప్రధానిగానే ఉండాలని..
మరోవైపు, అశోక్ బాబుపై వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామనడం విడ్డూరంగా ఉందని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి జగన్ పార్టీ సహకరిస్తూ, ఉద్యమాన్ని ప్రత్యేక హోదా పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని ప్రశ్నించని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.