వాళ్ల ఇష్టం: రాజీనామాలపై తగ్గిన అశోక్ బాబు
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయాలనే తమ డిమాండ్ విషయంలో ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. రాజీనామాలు చేయాలా, వద్దా అనే విషయాన్ని సీమాంధ్ర నేతలే నిర్ణయించుకోవాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనపై ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకులను కలుస్తామని, సమైక్య రాష్ట్రంలోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమని వివరిస్తామని ఆయన చెప్పారు. ప్రజలను మభ్యపెట్టడానికే కేంద్ర ప్రభుత్వం మంత్రుల బృందాన్ని (జివోఎంను) ఏర్పాటు చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని అశోక్ బాబు చెప్పారు. రాజీనామాలను స్పీకర్ తిరస్కరిస్తున్నందున ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతికి లేఖలు రాయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో దత్తాత్రేయ బిజీ..
భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఢీల్లీలో ఆ పార్గీ పెద్దలను కలుస్తూ బిజిబిజీగా ఉన్నారు. మంగళవారం ఉదయం పార్టీ అగ్రనేత ఎల్కె అడ్వాణీని కలుసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)కు ఒకే నివేదిక అందజేస్తామని అన్నారు. సీమాంధ్రలోని బీజేపీ నేతల అభ్యంతరాలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలపడం వంటి వివాదాస్పద అంశాలపై తర్వాత చర్చిస్తామని ఆయన అన్నారు. తర్వాత బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. రాజ్నాథ్ సింగ్తో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.