ఎపికి ప్రత్యేక హోదా కోసం ఇక 'ఆరడుగుల బుల్లెట్'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు హెచ్చరించారు. ఏపీకి ప్యాకేజీ చాలదని, ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన కోరారు.
హైదరాబాద్లో ఏపీ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఏపీజేఎఫ్ చేస్తున్న ధర్నాకు మద్ధతు ఇస్తున్నట్లు అశోక్బాబు ప్రకటించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన సమయంలో అశోక్ బాబును ఆరడుగుల బుల్లెట్గా అభివర్ణించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా సాధన ప్రమాణ సభ జరిగింది. ఈ సభలో మాల మహానాడు నేత కారెం శివాజీ, ప్రొఫెసర్ సుధాకర్రెడ్డి, చలసాని శ్రీనివాస్లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండు చేస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి జేఏసీ నిరసన వ్యక్తం చేసింది. కాగా ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీన ఢిల్లీ జంతర్మంతర్లో జరగనున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.