అశోక్ బాబు గెలుపు: జగన్కు ఆరడుగుల బుల్లెట్ షాక్!
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సహా పదిహేడు పదవులకు మొత్తం పదిహేడు పదవులను అశోక్ బాబు వర్గీయులే గెలుచుకున్నారు. అశోక్ బాబు ప్యానల్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగిన బషీర్ ప్యానల్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. అశోక్ బాబు ప్యానల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు 80 నుంచి 90 శాతం మేరకు ఓట్లు రాగా బషీర్ ప్యానల్కు 10 నుంచి 20 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి.
ఎపిఎన్జీవో సంఘంలో మొత్తం ఓట్లు 847 ఉన్నాయి. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 815 పోలయ్యాయి. వీటిలో 13 ఓట్లు చెల్లలేదు. కౌంటింగ్ ముగిసే సరికి అశోక్ బాబు ప్యానల్కు 630 ఓట్లు రాగా.. బషీర్ ప్యానల్కు 174 ఓట్లు మాత్రమే దక్కాయి. మరో రెండు రౌండ్ల కౌంటింగ్ మిగిలి ఉండగానే అశోక్ బాబు ప్యానల్ విజయం ఖాయమైపోయింది. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన అశోక్ బాబు 456 ఓట్ల ఆధిక్యంతోనూ, ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన చంద్రశేఖర రెడ్డి 425 ఓట్ల ఆధిక్యంతోనూ ఘన విజయం సాధించారు.
న్యాయం గెలిచింది: అశోక్బాబు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో మా ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగిందని, సంఘం ఎన్నికల సందర్భంగా జరిగిన పలు సంఘటనలను తాము గమనించామని, తమ ఉద్యోగులపై మానసికంగా, సామాజికంగా తీవ్ర ఒత్తిడి తెచ్చారని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తమ ప్యానల్ విజయం సాధించిందని అశోక్ బాబు అన్నారు. న్యాయం, ధర్మం తమవైపు ఉండడమే తమ విజయానికి కారణమన్నారు. ఎన్నికల ఫలితాలను గౌరవంగా స్వీకరిస్తున్నానని బషీర్ అన్నారు.
జగన్కు షాక్
అశోక్ బాబు ఎన్నిక జగన్కు షాకిచ్చినట్లయిందంటున్నారు. అశోక్ బాబు ప్యానల్ పైన పోటీ చేసిన ప్రత్యర్థులకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎపిఎన్జీవో, అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమంలో దూసుకు పోయారు. ఈ నేపథ్యంలో అశోక్ బాబుకు చెక్ చెప్పి ఎపిఎన్జీవో సమైక్య ఉద్యమాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకే జగన్ బషీర్ ప్యానల్ను ఉపయోగించుకున్నారంటున్నారు. అయితే, అశోక్ గెలుపు ద్వారా జగన్కు షాక్ తగిలినట్లయిందంటున్నారు.