పవన్ తెలియదనే చెప్పా, ఎన్టీఆర్ ఎంతో బాబూ అంతే: అశోక్ గజపతిరాజు, ‘మోడీతో అవే చర్చలు’
Recommended Video
హైదరాబాద్/అమరావతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ తెలియదనే చెప్పా..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు చూడనని అన్నారెందుకు? అనే మీడియా ప్రతినిధి ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ గురించి తనను ఎవరో అడిగారని... దానికి సమాధానంగా ఆయనెవరో తనకు తెలియదని చెప్పానని అశోక్ అన్నారు.
పవన్తో కలిసి ప్రచారం చేయలేదు
తాను ఎన్టీఆర్ సినిమాలే సరిగా చూడలేదని, ఇంక వేరేవారి సినిమాలు ఎలా చూస్తానని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. విజయనగరంలో తనకోసం ప్రచారం చేశానని పవన్ చెప్పారని... ఆయన, తాను కలిసి ప్రచారమే చేయలేదని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ అప్పుడు అడిగారు..
లోక్ సభకు వెళ్తారా? అని గతంలోనే ఎన్టీఆర్ తనను అడిగారని... అయితే రాజకీయాల్లో కొంచెం అనుభవం వచ్చాక వెళ్తే బాగుంటుందని తాను చెప్పానని అశోక్ తెలిపారు. ఇప్పుడు లోక్ సభలో ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో కూడా లోక్ సభకే ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ఎంతో బాబూ అంతే..
దివంగత ఎన్టీఆర్ మీద ఎంత గౌరవం ఉందో, చంద్రబాబు మీద కూడా తనకు అంతే గౌరవం ఉందని అశోక్ గజపతిరాజు తెలిపారు. వివిధ అంశాలపై చంద్రబాబు ఎక్కువగా విశ్లేషణలు చేస్తుంటారని, దాని ప్రభావం పనిపై ఉంటుందని అశోక్ అన్నారు. విశ్లేషణ, పని సమానంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు.
మోడీతో వాటిపై తప్ప మరోటి లేదు..
కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో తన పరిచయం నమస్కారం అంటే నమస్కారం అనే విధంగా ఉండేదని... ఇద్దరం ఎప్పుడైనా వ్యక్తిగతంగా మాట్లాడినా.. పాలనకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చకు వచ్చేవని అశోక్ గజపతిరాజు చెప్పారు. వేరే విషయాల గురించి మాట్లాడటానికి ఆయన వద్ద అవకాశం ఉండదని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.