ఎంబీయే అంటే చెప్పలేనివారు..: అమెరికా ఇమ్మిగ్రేషన్ ఇష్యూపై కేంద్రమంత్రి అశోక్
విజయనాగరం: అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు అక్కడ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలనే ఎంచుకోవాలని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక గజపతి రాజు ఆదివారం సూచించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.
ముందుగానే విద్యా సంస్థను ఎంపిక చేసుకుని వెళ్లాలి తప్ప, అక్కడికు వెళ్లి ఎంపిక చేసుకోవడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. విద్యార్థులను తీసుకెళ్లి తీసుకురావడం వరకే భారత విమానయాన శాఖ బాధ్యత అని చెప్పారు.
అమెరికాలో భారతీయ విద్యార్థులకు ఎదురౌతున్న ఇబ్బందులను విదేశాంగ శాఖ, సంబంధిత మంత్రి సుష్మా స్వరాజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంబీఏ అంటే ఏమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన వారు ఉద్యోగాలకు ఎలా అర్హులు అవుతారని అశోక గజపతి రాజు ప్రశ్నించారు.
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు చెందిన పలువురు విద్యార్థులను అమెరికా అధికారులు విమానాశ్రయం నుంచే వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం కూడా పద్దెనిమిది మంది విద్యార్థులను న్యూయార్క్ నుంచి తిప్పి పంపారు.